Abbayya Chowdary : దమ్ముంటే 2024 ఎన్నికల్లో నన్ను ఎదుర్కో.. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సవాల్
వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు.

MLA Abbayya Chowdary
MLA Abbayya Chowdary : ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇది వైసీపీ విజయమని, ప్రతిపక్ష కుయుక్తులు పనిచేయవని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. వీరమ్మకుంటలో నాలుగు రోజులుగా అలజడి సృష్టించాలని ప్రయత్నించారని తెలిపారు. ఇది పాత దెందులూరు కాదన్నారు.
కొఠారి అబ్బయ్యచౌదరి ఉన్నంతకాలం గొడవలు జరగనివ్వబోనని తేల్చి చెప్పారు. శనివారం వీరమ్మకుంట పంచాయతీ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పాల్గొని, మాట్లాడారు. దమ్ముంటే 2024 ఎన్నికల్లో తనను ఎదుర్కో అంటూ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సవాల్ విసిరారు. 50 వేల ఓట్ల మెజార్టీతో 2024 ఎన్నికల్లో దెందులూరులో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ విజయం ఎన్నికల శంఖారావమని వెల్లడించారు. వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు 286 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఉద్రిక్త పరిస్థితుల నడుమ వీరమ్మకుంట సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. వైసీపీ శ్రేణులు బాణా సంచా కాల్చుతున్న సమయంలో టీడీపీ కార్యకర్త కారుతో అక్కడికి వచ్చారు. పోలీసుల చొరవతో వెనక్కి వెళ్ళి పోయారు.