కుటుంబంలో విషాదాన్ని నింపిన కరోనా కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం

  • Published By: murthy ,Published On : August 10, 2020 / 04:56 PM IST
కుటుంబంలో విషాదాన్ని నింపిన కరోనా కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం

విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి, కుమారుడు కన్నుమూశారు.



కరోనా వ్యాధి తగ్గి నెగెటివ్ వచ్చి ఒకటి,రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోతామనుకున్నవారు కాటికి వెళ్ళారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన జయలక్ష్మి,పవన్ కుమార్ తల్లి కొడుకుల విషాదగాధ.

కందుకూరు పట్టణం గణేష్ నగర్ లో నివసించే దుడ్డుప్రసాద్ ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ లో కిరాణా షాపు నిర్వహిస్తుంటాడు. మంచి దైవభక్తి పరాణుడు. ఆంజనేయస్వామి మాల ధరించే భక్తులకు ఆ ప్రాంతంలో గురుస్వామిగా ప్రసిధ్ది చెందాడు.



కందుకూరు పరిసర ప్రాంతాల్లోని భక్తులు ప్రసాద్ గురు స్వామి వద్దే మాల ధారణ చేస్తుంటారు. ఆవిధంగా అందరికీ సుపరిచితుడు. ఈ క్రమంలో ప్రసాద్ కు గత నెల 30 వ తేదీన కరోనా వైరస్ సోకింది. విజయవాడ రమేష్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందాడు. నెగెటివ్ వచ్చాక రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.

అయితే ప్రసాద్ నుంచి వైరస్ భార్య జయలక్ష్మి(48) పెద్ద కుమారుడు పవన్ కుమార్(30) రెండో కుమారుడు మనోజ్ కు సోకింది. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్న జయలక్ష్మి, పవన్ కుమార్ లు రమేష్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందారు. ఇద్దరూ ప్రస్తుతం కోలుకున్నారు.
kandukuru mother, son
రెండురోజుల్లో ఇంటికి పంపించి వేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇంతలోనే ఊహించని విధంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వారు ఇరువురూ ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్నా అగ్నిప్రమాదంవారి పాలిట శాపంగా మారటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది.



పవన్ కుమార్ భార్య గర్బవతి
అగ్నిప్రమాదంలో మరణించిన పవన్ కుమార్ భార్య 7 నెలల గర్భవతి. అతను బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల కందుకూరు వచ్చివర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పవన్ కుమార్ కు ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన మౌనికతో వివాహం అయ్యింది.

ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భిణీ. ప్రస్తుతం పుట్టింట్లో తల్లి తండ్రుల వద్ద ఉంటోంది. పవన్ కుమార్ మృతితో ఆమె పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది. కరోనా రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.



ప్రసాద్ రెండో కుమారుడు మనోజ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నాడు, కరోనా సోకటంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాదంలో తల్లి, అన్న చనిపోయినా బయటకు రాలేని పరిస్దితిలో తల్లడిల్లిపోయాడు.