Sajjala Ramakrishnareddy : అర్హులందరికీ పెన్షన్స్ ఇస్తున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు విష ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు.

Sajjala Ramakrishnareddy : అర్హులందరికీ పెన్షన్స్ ఇస్తున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna

YSRCP leader Sajjala Ramakrishnareddy : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు విష ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రజల్లో, వృద్ధుల్లో అపోహలు పెంచడానికి ఓ వర్గం మీడియా ప్రయత్నం చేసిందన్నారు. పింఛన్ల పంపిణీ ఎలా ఉందో తీసుకుంటున్న వృద్ధులను అడిగితే తెలుస్తుందని చెప్పారు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆనాడు వైఎస్సార్ పింఛన్ పెంచి ఆదుకుంటే…ఇప్పుడు వైఎస్ జగన్ వారికి ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ చెప్పాక 2019 ఎన్నికల్లో అదే విషయాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వృద్ధులకు పింఛన్ పెంచాలనే ఆలోచనే లేదన్నారు. వచ్చే ఐదేళ్లలో 3 వేల వరకూ పెంచుకుంటూ వెళ్తానని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు. పూర్తి సంతృప్త స్థాయిలో ఇచ్చేందుకు సిద్ధపడ్డారని పేర్కొన్నారు.

ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని అలా ఆ మీడియా దాడులు చేస్తోందన్నారు. చంద్రబాబు దిగిన రోజు నుంచి ఆ మీడియా ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని చెప్పారు. 99 శాతం చేస్తే ఆ ఒక్కటీ ఎందుకు చేయలేదు అంటున్నారు…చేసింది మేమే అన్నది మరుస్తున్నారు అని పేర్కొన్నారు. ‘మీ బతుక్కి మీ హయాంలో పింఛన్ ఏ రోజు వస్తుందో కూడా తెలిసేది కాదు’ అని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. ఏ నెలది ఆ నెల ఇస్తున్న క్రెడిట్ తమ ప్రభుత్వానిదని…దాన్ని వదిలేసి ఏదేదో వెతుకుతున్నారని మండిపడ్డారు. రెండు రోజులు ఇలా రాతలు రాసి… ఆ తర్వాత న్యాయస్థానాలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్హులకు ఇస్తూ అనర్హులకు ఏరివేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వేరే రాష్ట్రంలో ఉండి పింఛన్ పొందుతుంటే ఏరి వేయాలని, ఏ నెలకు ఆ నెల తీసుకోవాలని చెప్పామని తెలిపారు. అందుకే ఎక్కుడున్నా మొదటి 5వ తేదీలోపు పింఛన్ డబ్బులు తీసుకోవాలని చెప్పామని పేర్కొన్నారు. ‘మీ బతుక్కి ఇటువంటి ఆలోచన చేయలేని మీకు ప్రశ్నించే అర్హత లేదు’ అని అన్నారు. 60 లక్షల మందికి నిర్విఘ్నంగా మొదటి తేదీన పింఛన్ వస్తోందని తెలిపారు.

‘మా వాడు సీఎం కాకపోతే ఇక ఎవరైనా సహించలేము’ అన్నట్లు టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆయా సంస్థలు ఇంతకు ముందు వాళ్ళు ఏమి చేశారో మర్చిపోయారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 2017లో సుమారు 40 లక్షల మందికే పింఛన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చే నాటికి 2019 జనవరిలో 50 లక్షల మందికి ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికలకు 3 నెలల ముందు వరకు 8 లక్షల మందికి అర్హత ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము వచ్చాక ప్రస్తుతం లోపాలు సరిదిద్దుకుంటూ వెళితే 60 లక్షలకు చేరిందన్నారు. ఈ రెండేళ్లలో 10లక్షలకు పైగా అర్హత సాధించి పింఛన్ పొందుతున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు లేవు..అయినా అర్హత ఉంటే అందరికీ ఇస్తున్నామని చెప్పారు.

ఇంత స్పష్టంగా సంక్షేమం నడుస్తుందని, నెలకు సుమారు 1400 కోట్లు మేము ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన దానికంటే మూడు రేట్లు ఎక్కువ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇలా చేస్తుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి బండలు వేస్తున్నారని మండిపడ్డారు. మేము టీడీపీ కరపత్రంలా ఉంటాం అని చెప్పి వార్తలు రాయండి..ప్రజలే నిర్ణయించుకుంటారని తెలిపారు. చంద్రబాబు నిజంగా బ్రహ్మాండంగా చేసి ఉంటే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారని ప్రశ్నించారు. నిజంగా తప్పులు, పొరపాట్లు ఉంటే వేయండి…ఇబ్బంది లేదన్నారు.

నాడు నేడులో మొదటి దశ పూర్తి అయ్యింది..2వ దశ స్కూళ్లను ఫోటోలు తీసి వేస్తున్నారని తెలిపారు. 2014-19 వరకు 63600 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, దీనిపై 6000 కోట్లు వడ్డీలే చెల్లిస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో విద్యుత్ సరఫరా బాగుందా అంటే అదీ లేదన్నారు. వాళ్ళకి కావల్సిన కంపెనీలకు ఆ సొమ్మును కట్టబెట్టారని ఆరోపించారు. ఈ వార్తలు ఆ మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు.

సోలార్ పవర్ పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వాడితే ఇప్పుడు రైతులకు ఇస్తున్న చార్జీలు తగ్గుతాయని చెప్పారు. పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ 24 గంటలు సరఫరా అందిస్తున్నామని వెల్లడించారు. టీడీపీ హయాంలో పోలవరం పునరావాసం పనులు ఎక్కడున్నాయని నిలదీశారు. ఇప్పుడు తాము ఆర్ అండ్ ఆర్ కోసం 6000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు అక్కడి కష్టాలకు కారణం అయ్యారో వాళ్లే వెళ్లి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవంగా అప్పటి తప్పుకు లోకేష్ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్ద పెద్ద ప్రాజెక్టులకు రెండేళ్లను ఎలా కొలమానంగా తీసుకుంటారో చెప్పాలన్నారు. అసలు మాట్లాడటానికి మీకు తలకాయ ఉందా? చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమ నాయకుడి గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గాలిగాడో…గడ్డపారో 2019 ఎన్నికల్లో జనం తేల్చారని పేర్కొన్నారు. వాళ్ళకి గడ్డపార దించారు కూడా..మరి ఆ వార్తను ఎందుకు వీళ్ళు హైలైట్ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళ అసభ్య మాటల్లో వారి కడుపు మంట స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

విజయమ్మ సమావేశం పెట్టడంలో తప్పేముందన్నారు. వైఎస్సార్ కూతురుగా షర్మిలమ్మకు ఆయన పేరుపై సమావేశాలు పెట్టె హక్కు లేదా అని అడిగారు. వైస్సార్ ని ఎవరైనా ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటే తమకు అంత మంచిదన్నారు. రోడ్లపై ఆందోళన అంటున్న పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడున్నారని అడిగారు. ఎక్కడో ఉంటూ ఇక్కడి రోడ్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాము సిద్ధంగా ఉన్నాం…నిధులు కూడా ఉన్నాయి..వర్షాకాలం తగ్గితే వెంటనే రోడ్లు వేస్తామని చెప్పారు.