Bandi Sanjay : ఏపీ ప్రజలారా జాగ్రత్త, దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన ఉంది.కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. Bandi Sanjay - CM Jagan
![Bandi Sanjay : ఏపీ ప్రజలారా జాగ్రత్త, దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర- బండి సంజయ్ సంచలన ఆరోపణలు Bandi Sanjay : ఏపీ ప్రజలారా జాగ్రత్త, దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర- బండి సంజయ్ సంచలన ఆరోపణలు](https://10tv.in/wp-content/uploads/2023/08/Bandi-Sanjay-CM-Jagan.jpg)
Bandi Sanjay - CM Jagan (Photo : Google)
Bandi Sanjay – CM Jagan : విజయవాడలో ”ఓటర్ చేతన్ మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే అని విమర్శించారు.
మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని మండిపడ్డారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బీజేపీని హేళన చేశారు.. ఏమైంది? అని బండి సంజయ్ అడిగారు. హేళన చేసిన పార్టీలే నామ రూపాల్లేకుండా పోయాయని గుర్తు చేశారు. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే దానికి కేంద్రం ఇస్తున్న నిధులే కారణం అన్నారాయన.
‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయి. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది. కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన ఉంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేలపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి” అని బండి సంజయ్ హెచ్చరించారు.