ఇన్ఫోసిస్ సీఈవోపై మరోసారి తీవ్ర ఆరోపణలు
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వివాదం మరింత ముదురుతోంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం కలకలం రేపుతోంది. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్పై ఇప్పుడు మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు.
సలీల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫోసిస్ కో ఫౌండర్, చైర్మన్ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు ఒక లేఖ రాశారు. సలీల్ పరేఖ్ కంపెనీలో చేరి ఒక సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ, ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు. పరేఖ్కు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ కేవలం తన వ్యాపార ప్రయోజనాలకోసమే బెంగళూరుకు మకాం మార్చకుండా, ముంబైలోనే ఉంటున్నారని ఆరోపించారు
కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్బ్లోయర్…పరేఖ్ అక్రమాలను బహిర్గతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నానంటూ తన ఫిర్యాదులో తెలిపారు. ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను ఛైర్మన్, బోర్డు దృష్టికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తక్షణమే స్పందించి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. సీఈవోకు స్టాక్ మార్కెట్ కనెక్షన్లు ఉన్నాయని, అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించిన ఫిర్యాదుదారుడు, పరేఖ్ తన పెట్టుబడుల పర్యవేక్షణ కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు.
దీన్ని ఆదర్శంగా తీసుకున్న చాలామంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించారన్నారు. సీఈవో నెలకు రెండు సార్లు ఆఫీస్కు వచ్చేందుకు విమాన చార్జీలు, ఇతర రవాణా చార్జీలకే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. నెలకు నాలుగు బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, ఇంటికి నుంచి ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకి, ఆఫీసు నుంచి విమానాశ్రయం వరకు పికప్, డ్రాప్ చార్జీలు ఇందులో ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆరోపించారు.