Cognizant AI Tools : కాగ్నిజెంట్లో 3,500 మంది ఉద్యోగుల తొలగింపు.. ఏఐ టూల్స్పై పెట్టుబడి కోసమేనా?
Cognizant AI Tools : చాట్జీపీటీ మాదిరి జనరేటివ్ AI టూల్స్పై కంపెనీ పెట్టుబడికి రెడీగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ ధృవీకరించారు. కంపెనీలో 3500 మంది ఉద్యోగులను తొలగించిన (ఒక శాతం మంది) తర్వాత కాగ్నిజెంట్ ఏఐ పెట్టుబడులపై ప్రణాళికలను ప్రకటించింది.
Cognizant AI Tools : ప్రముఖ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) ఇప్పుడు (ChatGPT) వంటి జనరేటివ్ AI టూల్స్ పై పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. బ్రియాన్ హంఫ్రీస్ (Brian Humphries) తర్వాత కాగ్నిజెంట్ సీఈఓ అయిన రవి కుమార్ ధృవీకరించారు. కంపెనీలో దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే.. కంపెనీ శ్రామికశక్తిలో ఒక శాతం మందిని తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. ఐటి రంగం ఎదుర్కొంటున్న సవాలక్ష సవాళ్లలో అధిక ఖర్చులను తగ్గించుకునేందుకు కొన్ని ఆఫీసులను కూడా మూసివేస్తామని కాగ్నిజెంట్ ప్రకటించింది.
నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ కొత్త CEO రవి కుమార్ ప్రస్తుతం కన్సల్టింగ్, డిజైన్, ఇంజనీరింగ్, కార్యకలాపాలు వంటి వివిధ రంగాలలో తమ ఉద్యోగుల పనిని వేగవంతం చేసేందుకు జనరేటివ్ AI అనే కొత్త టెక్నాలజీని టెస్టింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా తమ ఉద్యోగుల ఉత్పాదకతను మరింత రెట్టింపు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.
‘ప్రస్తుతం చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ వంటి జనరేటివ్ AI, క్లయింట్ల వ్యాపారాలను ప్రాథమికంగా మార్చేందుకు సొంత ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని అందిస్తున్నాయని పోస్ట్-ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా సీఈఓ రవి కుమార్ తెలిపారు. జనరేటివ్ AIలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామని ఆయన తెలిపారు. AI యాక్సిలరేటర్ అని పిలిచే ప్రక్రియను ప్రారంభించినట్టు చెప్పారు. ఏఐ టూల్స్ వినియోగానికి అత్యంత ముఖ్యమైన మార్గాలను కనుగొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సీఈఓ రవి కుమార్ స్పష్టం చేశారు.
30 మంది క్లయింట్లతో ఐడియాషన్ సెషన్లను నిర్వహించామన్నారు. ఇప్పుడు సాధారణ సవాళ్లకు పరిష్కారించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనరేటివ్ AI టెక్నాలజీ సర్వీసుల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని, తద్వారా అధిక ఉత్పాదకతను సృష్టిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. సాఫ్ట్వేర్, డేటా ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని విశ్వసిస్తున్నామని ఆయన తెలిపారు.
కాగ్నిజెంట్లో ఉద్యోగుల తొలగింపులు :
కొన్ని రోజుల క్రితమే.. కంపెనీలో తొలగింపులు జరగబోతున్నాయని సీఈఓ రవి కుమార్ ధృవీకరించారు. ఉద్యోగులపై మాత్రమే కాదు.. కార్పొరేట్ విధులు, నాన్-బిల్ ఓవర్హెడ్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. భారత మార్కెట్లోని ప్రతి కంపెనీలో 10-15 శాతం మంది వర్క్ఫోర్స్ మాత్రమే కార్యాలయాలకు వస్తున్నందున రియల్ ఎస్టేట్ ఖర్చులలో నిర్మాణాత్మక మార్పు ఉంటుంది. 30-40 శాతం మంది భారతీయ ఐటి ఉద్యోగులు టైర్ II, టైర్ III నగరాల్లో ఉన్నారు. ఈ నగరాల్లో సామాజిక మూలధనాన్ని సృష్టించడం చాలా అవసరమని కుమార్ అభిప్రాయపడ్డారు.
రెండేళ్ల రెజిగ్ ప్రోగ్రామ్ ఫలితంగా కాగ్నిజెంట్లో తొలగింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన ఖర్చులను కవర్ చేసేందుకు కాగ్నిజెంట్ 200 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని యోచిస్తోంది. ఈ ఖర్చులు ప్రధానంగా నాన్-బిల్ చేయదగిన కార్పొరేట్ సిబ్బందికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. 2023లో కాగ్నిజెంట్లో ఉద్యోగాల కోత మరింత ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also : 2023 Skoda Kodiaq SUV : అద్భుతమైన ఫీచర్లతో 2023 స్కోడా కొడియాక్ కారు.. భారత్లో ఫుల్ డిమాండ్.. ధర ఎంతంటే?