లీటర్ డీజిల్ ధర రూ.80, ఢిల్లీలో పెట్రోల్ కన్నా డీజిల్ ప్రియం, కారణం ఇదే

ఇంటర్నేషనల్‌‌ బెంచ్‌‌ మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడి మార్కెట్ లో అయినా, ఏ సమయంలో అయినా పెట్రోల్‌ ధర

లీటర్ డీజిల్ ధర రూ.80, ఢిల్లీలో పెట్రోల్ కన్నా డీజిల్ ప్రియం, కారణం ఇదే

ఇంటర్నేషనల్‌‌ బెంచ్‌‌ మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడి మార్కెట్ లో అయినా, ఏ సమయంలో అయినా పెట్రోల్‌ ధర

ఇంటర్నేషనల్‌‌ బెంచ్‌‌ మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడి మార్కెట్ లో అయినా, ఏ సమయంలో అయినా పెట్రోల్‌ ధర ఎక్కువ, డీజిల్‌ ధర తక్కువగా ఉంటుంది. కానీ, కనీవినీ ఎరుగని విధంగా దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో మొదటిసారిగా పెట్రోల్‌ ధరను డీజిల్‌ ధర దాటేసింది. అక్కడ పెట్రోల్ కన్నా డీజిల్ ప్రియంగా మారింది. వరుసగా 19వ రోజూ(జూన్ 25,2020) కూడా చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం(జూన్ 25,2020) డీజిల్‌పై 14 పైసలు, పెట్రోల్ పై 16 పైసలు పెంచాయి చమురు సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర 80 రూపాయలు(రూ.80.02) దాటింది. పెట్రోల్‌ ధర రూ.79.92.

గత 19 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్‌ పై రూ.8.66, డీజిల్‌ పై రూ.10.63 పెరిగింది:
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్థానిక పన్నులు/వ్యాట్‌ లో వ్యత్యాసం వల్ల ఈ రెండు ఇంధనాల ధరలు ఢిల్లీలో కన్నా ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటున్నాయి. తాజా సవరణతో ఇతర నగరాల కన్నా ఢిల్లీలో పెట్రోల్ కన్నా డీజిల్‌ ధర అధికమైంది. గత 19 రోజుల వరుస సవరణలతో లీటర్‌ డీజిల్‌ పై రూ.10.63 మేర, లీటర్‌ పెట్రోల్‌ పై రూ.8.66 మేర ధర పెరిగింది.

ఢిల్లీలో డీజిల్ ధరలు పెరగడానికి కారణమిదే:
ఒక్క ఢిల్లీలో మాత్రమే పెట్రోల్‌కన్నా డీజిల్‌ ధర అధికంగా ఉంది. ఇందుకు కారణమేమిటంటే.. మే నెలలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంధనాలపై స్థానిక అమ్మకం పన్ను లేదా విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను భారీగా పెంచింది. మే 5న పెట్రోల్‌పై వ్యాట్‌ను 27 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌పై 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై అదనంగా ఎయిర్‌ యాంబియెన్స్‌ లెవీ కింద కిలో లీటర్ పై రూ.250 విధించారు. దీని వల్ల ధర మరింత ఎగబాకింది. మే 5న ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం రూ.7.30 ఉంది. ఇప్పుడు పెట్రోల్ కన్నా డీజిల్ ధర ఎక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం రాజస్థాన్‌ (రూ.80.68) తర్వాత ఢిల్లీలోనే డీజిల్‌ ధర ఎక్కువగా ఉంది.

గత 19 రోజులుగా ఇంధన ధరల బాదుడు:
జూన్‌ 7 నుంచి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల రోజువారీ సవరణ మొదలుపెట్టాయి. అప్పటి నుంచి 19 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్‌ పై  రూ.8.66, డీజిల్‌ రూ.10.63 పెరిగింది. ఇక అహ్మదాబాద్‌లో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సమాన స్థాయికి చేరువలో ఉన్నాయి. చాలా రాష్ట్రాలు డీజిల్‌పై తక్కువ పన్నును విధిస్తున్నాయి. దీని వల్ల పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధర తక్కువగా ఉంది. ఇంతకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం రూ.18 నుంచి 20 ఉండేది.

2012లో పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.30:
గవర్నమెంట్ డేటా ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.30.25గా ఉండేది. అంటే 74శాతం వ్యత్యాసం అన్నమాట. ఇది 2012 జూన్ 18 నాటి మాట. ఆ సమయంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.16 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.40.91గా ఉంది. ఇక ముంబై విషయానికి వస్తే ఈ రెండు ఇంధన ధరల మధ్య వ్యత్యాసం రూ.31.17గా ఉండేది. ఇది 2012 జూన్ 28 నాటి మాట. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.76.45 కాగా, లీటర్ డీజిల్ ధరల రూ.45.28. కానీ పన్నులను పెంచుతూ పోయిన కొద్దీ ఈ వ్యత్యాసం తగ్గిపోతూ వస్తోంది. మొత్తంగా గత 19 రోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి.

పలు నగరాల్లో గురువారం(జూన్ 25,2020) పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలు:
ఢిల్లీ : పెట్రోల్ రూ.79.92, డీలిల్ రూ.80.02
గుర్గావ్ : పెట్రోల్ రూ.78.15, డీజిల్ రూ.72.31
మంబై : పెట్రోల్ రూ.86.70, డీజిల్ రూ.78.34
చెన్నై : పెట్రోల్ రూ.83.18, డీజిల్ రూ.77.29
హైదరాబాద్ : పెట్రోల్ రూ.82.96, డీజిల్ రూ.78.19
బెంగళూరు : పెట్రోల్ 82.52, డీజిల్ రూ.76.09

Read: ఆ రాష్ట్రంలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఒకే ధర..