Ola Electric GigaFactory : ఓలా ఫస్ట్ సెల్ గిగాఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగవంతం.. భారత్లోనే అతిపెద్దది.. ఇదిగో ఓసారి లుక్కేయండి..!
Ola Electric GigaFactory : 2023 చివరి నాటికి సొంత లిథియం-అయాన్ సెల్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఓలా సీఈఓ ప్రకటించారు. భారత్లో ఓలా ఫస్ట్ సెల్ గిగాఫ్యాక్టరీని నిర్మాణ పనులను ప్రారంభించింది.
Ola Electric GigaFactory : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) భారత మార్కెట్లో ఫస్ట్ సెల్ గిగాఫ్యాక్టరీపై పని ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ సెల్ గిగాఫ్యాక్టరీపై కంపెనీ పని ప్రారంభించిందని ట్వీట్ చేశారు. ఈ గిగాఫ్యాక్టరీ భారత మార్కెట్లో అతిపెద్దదని, ప్రపంచంలోని అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీలలో ఇదొకటి అని అగర్వాల్ పేర్కొన్నారు.
గిగాఫ్యాక్టరీ ప్లాంట్ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుల వీడియో, ఫొటోలను సీఈఓ ట్వీట్ చేశారు. మరోవైపు.. భారత్లో ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా సొంత తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓలా ఎలక్ట్రిక్ కూడా తమ గిగాఫ్యాక్టరీ పనులను మరింత వేగవంతం చేస్తోంది.
ఈ ఏడాది ఆఖరిలోగా లిథియం అయాన్ సెల్ :
2023 చివరి నాటికి సొంత లిథియం-అయాన్ సెల్ను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందని గత ఏడాదిలో ఓలా సీఈఓ ప్రకటించారు. ఈ లిథియం-అయాన్ సెల్లను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి, భారతీయ ఈవీ తయారీదారులు లిథియం-అయాన్ బ్యాటరీ సెల్స్ కోసం చైనా, తైవాన్, జపాన్, కొరియాలపై ఆధారపడుతున్నారు.
ఈ ఫ్యాక్టరీ ప్రారంభ సామర్థ్యం 5 గిగావాట్లు ఉంటుందని అంచనా. తద్వారా భారత మొదటి, అతిపెద్ద లిథియం సెల్ తయారీదారులుగా నిలుస్తామని అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా టెక్నాలజీని రూపొందిస్తున్నామని, ఇతర దేశాలపై ఆధారపడకుండా ఇప్పటికే తమ సొంత టెక్నాలజీని నిర్మించామని అగర్వాల్ అన్నారు.
నిర్మాణ పనుల ఫొటోలు, వీడియో ట్వీట్ చేసిన సీఈఓ అగర్వాల్ :
Work started and moving along at full speed on our cell gigafactory!
It will be India’s biggest and amongst the worlds biggest cell factories. And the centrepiece for #endICEage! pic.twitter.com/Nr6k5rMT6O
— Bhavish Aggarwal (@bhash) May 26, 2023
తమిళనాడులోని కృష్ణగిరిలో ఓలా గిగాఫ్యాక్టరీ :
ఈ ఓలా గిగాఫ్యాక్టరీ తమిళనాడులోని కృష్ణగిరిలో ఉంది. లిథియం-అయాన్ సెల్ కోసం కృష్ణగిరిలో పెద్ద గిగాఫ్యాక్టరీని ఓలా ఏర్పాటు చేసింది. మొదట ఓలా ఎలక్ట్రిక్ బైక్లకు ఈ బ్యాటరీలను వినియోగించుకోనుంది. ఆ తర్వాత మార్కెట్లోకి అందుబాటులో తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ 2023 ఎజెండాపై ఓలా సీఈఓ మాట్లాడుతూ.. మోటర్బైక్లు, లిథియం-ఆయిన్ సెల్లను తయారు చేయడంతో పాటు వాణిజ్య వాహనాల రంగంలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని భవిష్ అగర్వాల్ చెప్పారు. 2023లో పెట్టుబడిపై దృష్టి పెట్టడంతో పాటు చిన్న తక్కువ బరువున్న వాణిజ్య వాహనాలు, మోటార్బైక్లు, లిథియం-అయాన్ సెల్లతో పాటు ఇతర ప్రొడక్టులను ప్రారంభించే యోచనలో ఉన్నామని ఓలా అగర్వాల్ వెల్లడించారు.