Vodafone Layoffs : వోడాఫోన్లో భారీ ఉద్యోగాల కోతకు ప్లాన్.. 11వేల మందిని తొలగించక తప్పదు.. సీఈఓ ప్రకటన
Vodafone Layoffs : వోడాఫోన్ కంపెనీలో ఉద్యోగాల కోత విధించనున్నట్టు కొత్త సీఈఓ మార్గరీటా డెల్లా ప్రకటించారు. సంస్థ ఖర్చులను ఆదా చేసేందుకు వర్క్ఫోర్స్ను తగ్గించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Vodafone Layoffs : బ్రిటీష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ (Vodafone) వచ్చే మూడేళ్లలో గ్లోబల్ వర్క్ఫోర్స్లో 11వేల మంది ఉద్యోగులకు తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. కంపెనీ షేరు ధర రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అందులోనూ టెలికం రంగంలో పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచడానికి కస్టమర్ అనుభవాన్ని పెంచుకునే దిశగా వోడాఫోన్ ప్రయత్నిస్తోంది. వోడాఫోన్ కంపెనీలో భారీగా తొలగింపులు ఉండనున్నట్టు నవంబర్లో తొలిసారిగా ప్రకటించిన కంపెనీ ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయించింది.
గత నెలలో సీఈఓగా వోడాఫోన్ మాజీ ఫైనాన్స్ చీఫ్ డెల్లా వల్లే (Margherita Della Valle) నియమితులయ్యారు. కంపెనీలో ఉద్యోగుల పనితీరు తగినంతగా లేదు. వోడాఫోన్లో అనేక మార్పులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కంపెనీ ఎప్పుడు కస్టమర్లకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కస్టమర్లు ఆశించే నాణ్యమైన సర్వీసును అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగతామని ఆయన అన్నారు.
Read Also : Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియాలో రూ.549 ప్లాన్ రద్దు.. ఈ సరికొత్త ప్లాన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు..!
ఇప్పుడు వోడాఫోన్ను మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించేందుకు ప్రణాళికలు వేస్తోందని సీఈఓ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను భారీగా తగ్గించే ప్రణాళికల్లో భాగంగానే ఉద్యోగాల కోత విధించనున్నట్టు చెప్పారు. ఈ ప్రణాళికలతో కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతలను విధించనుంది. అంటే.. దాదాపు 11వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
వోడాఫోన్ ఆర్థిక పనితీరు అధ్వాన్నంగా మారడంతో సిబ్బంది తగ్గింపు తప్పదని కంపెనీ పేర్కొంది. మార్చి చివరి నుంచి ఏడాదికి గ్రూప్ కోర్ ఆదాయాలు 14.7 బిలియన్ యూరోలకు క్షీణించాయి. అమెరికాలో (AT&T), వెరిజోన్, చైనాలోని చైనా మొబైల్, చైనా యునికామ్ వంటి ప్రత్యర్థుల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. ఇటీవలి ఏళ్లలో భారీగా ఖర్చులు పెరగడంతో కస్టమర్ వృద్ధి మందగించి వొడాఫోన్ కంపెనీ తీవ్రంగా దెబ్బతింది. వోడాఫోన్ కార్యాచరణ ప్రణాళిక మూడు ప్రాధాన్యతలపై దృష్టి సారించింది. అందులో కస్టమర్ అనుభవం, బ్రాండ్లో గణనీయమైన పెట్టుబడి, మూడు సంవత్సరాలలో 11వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
అంతకుముందు నవంబర్ 2022లో, వోడాఫోన్ వార్షిక లాభాల అంచనాను తగ్గించిన తర్వాత ఇంధన బిల్లులు, ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించేందుకు ఉద్యోగాల కోతలతో సహా ఖర్చు తగ్గించే ప్రణాళికను ప్రకటించింది. డిసెంబరులో నాలుగేళ్ల పదవీ కాలంలో మార్కెట్ విలువలో 40 శాతం క్షీణించింది. ఆ తర్వాత సీఈఓ నిక్ రీడ్ పదవి నుంచి వైదొలిగారు. వోడాఫోన్ యూకే కార్యకలాపాలను సీకే హచిసన్ యాజమాన్యంలోని పోటీదారు త్రీ యూకేలో విలీనం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.