అనంతలో యువతిని కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్

  • Published By: murthy ,Published On : November 3, 2020 / 03:13 PM IST
అనంతలో యువతిని కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్

constable kidnapped the young woman : అనంతపురంలో ఓ కానిస్టేబుల్ యువతిని కిడ్నాప్ చేయటం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో…. ఆజాద్ నగర్ లో రోడ్డుపై నడిచి వెళుతున్న జ్యోతి అనే యువతిని కానిస్టేబుల్ భగీరధాచారి కిడ్నాప్ చేసినట్లు ఆమె తల్లి తండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కర్నూలు జిల్లా అవుకు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే భగీరధాచారితో జ్యోతికి 5 నెలల క్రితం నిశ్చితార్ధం జరిగింది. అనంతరం భగీరధ్ గురించి ఎంక్వయిరీ చేయగా అతనికి అప్పటికే పెళ్లైన విషయం తెలిసింది.



ముహూర్తానికి ఒకరోజు ముందు జ్యోతి కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకున్నారు. అయినా భగీరధ్ కోపంతో నిన్ను వదిలిపెట్టను అని జ్యోతి వెంటపడుతూనే ఉండి వేధిస్తున్నాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చి జ్యోతిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు. సమాచారం తెలిసిన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ ఫుటేజి ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు నిన్న రాత్రి కిడ్నాప్ చేసిన వాహనాన్ని తాడిపత్రి సమీపంలో గుర్తించారు. అక్కడి నుంచి వేరే వాహనంలోకి మార్చి కడప మీదుగా తిరుపతి తీసుకువెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా సాయంత్రంలోగా జ్యోతితో సహా పోలీసులకు లొంగిపోతానని భగీరధ్ కొందరు మిత్రులకు చెప్పినట్లు సమాచారం.