ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని యువతి ఆత్మహత్య
Young Woman Suicide : ప్రేమించిన వ్యక్తితో తన పెళ్లి చేయటానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం మండల పరిధిలోని జలగంనగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది.
జలగం నగర్కు చెందిన మెరుగు మాధురి(22) అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో ఆ యువతి తన ప్రేమ విషయం బయటపెట్టింది. తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయమని కోరింది.
ఆమె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇరువురి కులాలు వేరవటంతో కులాంతర వివాహం చేసేందుకు నిరాకరించారు. ఇంటికి పెద్ద కూతురు అయిన నువ్వే కులాంతర వివాహం చేసుకుంటే.. చిన్న కూతురు, కొడుక్కి పెళ్లిళ్లు ఎలా చేయాలని ప్రశ్నించారు. తాను ప్రేమించిన వ్యక్తితో కుటుంబ సభ్యులు తన వివాహం చేయరనే మనస్తాపంతో ఆ యువతి గురువారం రాత్రి గదిలో తలుపులు వేసుకొని కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
https://10tv.in/school-girl-suspicious-death-in-adilabad-district/
రక్తపు మడుగులో పడి ఉన్న మాధురిని ఆమె సోదరి చూసి ఇంట్లోవాళ్లకు చెప్పింది. వారు వెంటనే ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకు వెళ్లారు. మూడు ఆసుపత్రులు తిరిగినా ఎవరూ చేర్చుకోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మాధురి కన్ను మూసింది.
కాగా, యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో…. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.