Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో యూపీ చీఫ్ డెవలప్మెంట్ అధికారి రవీంద్ర కుమార్ స్పందిస్తూ నిందితులిద్దరినీ గుర్తించామని, వారిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
![Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు](https://10tv.in/wp-content/uploads/2023/07/Untitled-1-218.jpg)
PRD Jawans Kicks Specially-abled Man: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నీళ్లు అడిగినందుకు ఒక దివ్యాంగుడిని ఇద్దరు జవాన్లు నడిరోడ్డుపై చావబాదారు. ఒక వ్యక్తి ఇంటి నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైలర్ అయింది. రాష్ట్రంలోని దియోరియా ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన శనివారం జరిగింది. వీడియో ప్రకారం.. యూపీలోని ప్రాంతీయ రక్షక్ దళ్ కు చెందిన ఇద్దరు జవాన్లు సచిన్ సింగ్ అనే దివ్యాంగుడిని విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. అతడు భయంతో అక్కడి నుంచి తన ట్రైసైకిల్ మీద పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, అతడిని వెంబడించి పట్టుకొని మరీ కొట్టారు.
ఆ సమయంలో అతడిని తీవ్రంగా దుర్భషలాడినట్లు సమాచారం. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో యూపీ చీఫ్ డెవలప్మెంట్ అధికారి రవీంద్ర కుమార్ స్పందిస్తూ నిందితులిద్దరినీ గుర్తించామని, వారిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంకల్ప్ శర్మ పేర్కొన్నారు. నిందితులిద్దరూ రాజేంద్ర మరణి, అభిషేక్ సింగ్ అని ఆయన తెలిపారు.
In UP’s Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G
— Piyush Rai (@Benarasiyaa) July 30, 2023
బాధితుడి పేరు సచిన్ సింగ్. వయసు 26 ఏళ్లు. 2016లో ముంబైలో జరిగిన ఒక ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. అతడు సిమ్ కార్డ్ సెల్లర్ గా పని చేస్తున్నాడు. అలాగే ఒక రెస్టారెంట్లో డెలివరీ బాయ్ గా కూడా పని చేస్తున్నాడు. సచిన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా తనకు రోడ్డుపై తాబేలు కనిపించిందట. దాన్ని ఎత్తుకుని దుగ్ధేశ్వరనాథ్ ఆలయ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడే వదిలేసినట్లు తెలిపాడు.
అయితే చెరువు నుంచి తిరిగి వస్తుండగా.. తనకు ప్రాంతీయ రక్షణ దళ్ కు చెందిన ఇద్దరు జవాన్లు కనిపిస్తే వారిని నీళ్లు అడిగాడట. అయితే నీళ్లు ఇవ్వకపోగా, తనను దారుణమైన పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా కొట్టారట. అంతే కాకుండా, జైలులో వేయిస్తామంటూ బెదిరింపులు చేసినట్లు బాధితుడు తెలిపాడు.