Jubilee Hills rape case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక పరిణామం.. నిందితులను మేజర్లుగా పరిగణించాలని పోలీసుల పిటిషన్
హైదరాబాద్, జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్లు అయిన నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Jubilee Hills rape case: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ ఐదుగురు నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఐదుగురు నిందితులకు మెచ్యూరిటీ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. మేజర్లకు ఉండాల్సిన లక్షణాలన్నీ వారికి ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందితులను మైనర్లుగా కాకుండా, మేజర్లుగా పరిగణించాలని కోరారు. దీనిపై త్వరలోనే నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. ఈ తీర్పు ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటారు. గత ఏప్రిల్ 28న జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్లో పార్టీ జరుపుకొనేందుకు వెళ్లిన బృందంలోని మైనర్ బాలికపై ఒక యువకుడితోపాటు, మరో నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. నిందితుల కుటుంబాలకు రాజకీయ, వ్యాపార నేపథ్యం ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది.
ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు.