బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో ఊహించని ట్విస్ట్

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 07:44 AM IST
బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో ఊహించని ట్విస్ట్

తెలంగాణలో సంచలనం రేపిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రేమకు నిరాకరించిందని దివ్యను.. వెంకటేశ్ అనే ప్రేమోన్మాది హత్య చేశాడని వార్తలు వచ్చాయి. దీనిపై నిందితుడు వెంకటేశ్ తండ్రి పరశురామ్ గౌడ్ స్పందించారు. ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. తన కొడుకు వెంకటేశ్ తో దివ్యకు గతంలోనే వివాహమైందన్నారు. 5వ తరగతి నుంచే ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో కోచింగ్ కు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నారని తెలిపారు. దివ్యను తామే హైదరాబాద్ లోని హాస్టల్ లో ఉంచి చదివించామన్నారు. దీనికి ఆధారంగా వెంకటేశ్, దివ్య కలిసున్న ఫొటోలను పరశురామ్ పోలీసులకు చూపారు.

దివ్యను మేమే చదివించాము.. వెంకటేశ్, దివ్య పెళ్లి చేసుకున్నారు:
ఓయూలో సీటు వస్తే తానే స్వయంగా దివ్యను జాయిన్ చేయించానని చెప్పారు. ప్రేమ పెళ్లి చేసుకుందని దివ్యను ఆమె తల్లిదండ్రులు వేములవాడలోనే వదిలేసి వెళ్లిపోయారని పరశురామ్ గౌడ్ వివరించారు. దివ్య బాగా చదువుకుని ప్రయోజకురాలు కావడంతో మళ్లీ ఆమెని చేరదీశారని, ఆమె మనసుని మార్చారని తెలిపారు. బ్యాంకు ఉద్యోగం రావడంతో మరో వ్యక్తితో దివ్య తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారని చెప్పారు. దివ్య మిస్ అయ్యిందని ఆమె తల్లిదండ్రులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు దివ్య తల్లిదండ్రులపైనే కోప్పడ్డారని పరశురామ్ చెప్పారు. దివ్య, వెంకటేశ్ లను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని పరశురామ్ వెల్లడించారు. నిందితుడు వెంకటేశ్ తండ్రి పరశురామ్ చెప్పిన విషయాలు కేసుని మరో మలుపు తిప్పాయి.

అసలు.. ఏది నిజం..?
సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ తర్వాత.. దివ్య.. వెంకటేశ్ ను వదిలి వెళ్లిపోయిందని.. తల్లిదండ్రులకు దగ్గరైందని పరశురామ్ తెలిపారు. తల్లిదండ్రులకు దగ్గరయ్యాక దివ్యలో కొంత మార్పు వచ్చిందన్నారు. వెంకటేశ్ తరుచుగా దివ్య దగ్గరికి వెళ్తూ ఉండేవాడని, దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయన్నారు. ఈ క్రమంలో 2018 అక్టోబర్ 9న ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ లో వెంకటేశ్ వేధిస్తున్నాడని దివ్య ఫిర్యాదు చేసింది. దివ్య ఫిర్యాదుతో పోలీసులు వెంకటేశ్ తో పాటు అతడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఇకపై దివ్య జోలికి వెళ్లమని వెంకటేశ్ పోలీసులకు లెటర్ రాసి ఇచ్చాడు. దీంతో సమస్య పరిష్కారమైందని ఇరు కుటుంబాల వారు భావించారు. అయితే ఫోన్ లో వెంకటేశ్, దివ్య మాట్లాడుకునే వారని పరశురామ్ తెలిపారు. మొత్తంగా గతంలోనే ఇద్దరికీ పరిచయం ఉందని, ఇద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకున్నారని నిందితుడు వెంకటేశ్ తండ్రి చెప్పారు.

దివ్య తల్లిదండ్రులు మాత్రం పరశురామ్ వ్యాఖ్యలను ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు. వెంకటేశ్ తరుచూ దివ్యని వేధించాడని, ఇబ్బంది పెట్టాడని వాపోయారు. వెంకటేశ్ ఒక సైకో అని చెబుతున్నారు. నిందితుడు వెంకటేశ్ తండ్రి ఒకలా, దివ్య తల్లిదండ్రులు మరోలా చెప్పడంతో.. ఈ కేసులో మిస్టరీ నెలకొంది. అసలేం జరిగింది? దివ్య హత్యకు కారణం ఏంటి? నిందితుడు వెంకటేశ్ దొరికితే కానీ.. ఈ మిస్టరీ వీడదని పోలీసులు అంటున్నారు.

వెంకటేశ్ స్వగ్రామం వేములవాడలోని శాస్త్రినగర్ కు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం వెంకటేశ్ తల్లిదండ్రులను విచారించింది. వెంకటేశ్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలిస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉన్నాడా లేక ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దివ్య నివాసం ఉండే ఎల్లారెడ్డి గూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి.

వెంకటేశ్ తల్లిదండ్రులు అరెస్ట్:
మరోవైపు ఈ కేసులో నిందితుడు వెంకటేశ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వెంకటేశ్ తల్లిదండ్రులను రాజన్న సిరిసిల్లా జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సిద్దిపేట జిల్లాకు తరలించారు. అటు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు వెంకటేశ్ ను అరెస్ట్ చేసే వరకు దివ్య మృతదేహాన్ని తరలించేది లేదని కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పారు.

అసలేం జరిగిందంటే:
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో దివ్య అక్కడ 8వ తరగతి చదివింది. ఆ సమయంలోనే క్లాస్‌మేట్‌ అయిన వెంకటేష్‌.. దివ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి బాధ పడలేక వారు ఎల్లారెడ్డిపేటకు వెళ్లారు. వెంకటేశ్‌ గౌడ్‌ అక్కడికి కూడా వెళ్లి దివ్య వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మందలించిన పోలీసులు.. మరోసారి ఆమె వెంటపడనంటూ అతడితో కాగితం రాయించుకుని వదిలేశారు. 

ఫిబ్రవరి 26న దివ్య పెళ్లి.. ఇంతలో దారుణం:
కొన్నాళ్ల పాటు ఊరుకున్న వెంకటేశ్‌.. మళ్లీ దివ్య వెంట పడడం ఆరంభించాడు. అతడి నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఆమె మాత్రం బాగా చదువుకుంది. 4 నెలల క్రితమే ఏపీజీవీ బ్యాంకు గజ్వేల్‌ శాఖలో ఉద్యోగం సంపాదించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా గజ్వేల్‌కు వచ్చి ఉంటున్నారు. ఇటీవలే దివ్యకు వరంగల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. 26న వివాహం జరగాల్సి ఉంది. ఎప్పటిలాగే మంగళవారం కూడా దివ్య ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం వచ్చింది. మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

వెంకటేశ్ ను ఉరితీయాలి:
కూతురు దారుణ హత్యకు గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు నిర్జీవంగా పడి ఉండడంతో బోరున విలపించారు. తమ కూతురిని దారుణంగా హతమార్చిన నిందితుడు వెంకటేష్‌ గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌తో విచారణ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు దివ్య కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వారం రోజుల్లో బంధువులతో కళకళలాడాల్సిన దివ్య ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read More>>భద్రత ఏది.. టోల్ ప్లాజా దగ్గర మహిళపై అత్యాచారం