Cheating Wife : పెళ్లైన రెండు రోజులకే భర్తను మోసం చేసి పరారైన కొత్త పెళ్ళికూతురు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి మహిళ చేతిలో ఇలాగే మోసపోయాడు. పెళ్లైన రెండో రోజే ఇంట్లో ఊన్న నగదు, బంగారం, వెండి తీసుకుని పరారయ్యింది ఆ పెళ్లి కూతురు.
Cheating Wife : పెళ్లిపేరుతో జరిగే మోసాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో కుదుర్చుకున్నవి కానీ ఇతరత్రా కానీ జరిగే పెళ్లిళ్ళలో సాధారణంగా అన్నీవిచారించుకునే ముందుకు వెళతారు. కొన్నిసార్లు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోసపోతూ ఉంటారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి మహిళ చేతిలో ఇలాగే మోసపోయాడు. పెళ్లైన రెండో రోజే ఇంట్లో ఊన్న నగదు, బంగారం, వెండి తీసుకుని పరారయ్యింది ఆ పెళ్లి కూతురు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కూర్మిధ్దలో నివసించే రమణారెడ్డికి (పేరు మార్చాం) 40 ఏళ్లు వచ్చినా పెళ్లికాకపోవటంతో మిత్రుడి ద్వారా ఒక పెళ్లిళ్ల బ్రోకర్ను సంప్రదించాడు. అతనికి లక్ష రూపాయలు బ్రోకరేజి ఇస్తే మధ్యవర్తిగా ఉండిపెళ్లి చేయిస్తానని బేరం కుదుర్చుకున్నాడు. లక్ష ఇచ్చినా…. పెళ్ళవుతుందనే ఆనందంతో రమణా రెడ్డి మధ్యవర్తితో డీల్ కుదుర్చుకున్నాడు. ఆక్రమంలో….. విజయవాడలో తల్లి తండ్రులు లేని రాజ్యలక్ష్మి (పేరు మార్చాం) అనే అనాధ యువతి ఉంది చేసుకోమని మధ్యవర్తి రమణారెడ్డికి చెప్పాడు. మధ్యవర్తి ద్వారా విజయవాడ వెళ్లి రాజ్యలక్ష్మిని చూసి…. వివరాలు నచ్చిన రమణా రెడ్డి మధ్యవర్తికి లక్ష రూపాయలు చెల్లించి ఆమెతో ముహూర్తం పెట్టుకున్నారు.
గత గురువారం డిసెంబర్ 16న విజయవాడ లోని ఒక హోటల్ లో రమణా రెడ్డి కి, రాజ్యలక్ష్మి కి వివాహం జరిగింది. అనంతరం కొత్త దంపతులిద్దరూ యాదగిరి గుట్టవచ్చారు. అక్కడ వ్రతం చేసుకున్నారు. రాజ్యలక్ష్మితో పాటు ఆమె స్నేహితురాలు మరోక మహిళ కూడా తోడుగా వచ్చింది. ముగ్గురు హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం షాపింగ్ చేశారు. 3 తులాల బంగారు గొలుసు, రూ.40 వేల దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి గం. 8.30కి స్వగ్రామం చేరుకున్నారు.
ఇంటికి వచ్చిన కొద్ది సేపటికి కొత్త పెళ్లి కూతురు బ్యాగులో బట్టలు బీరువాలో సర్దే నెపంతో బీరువాలోని రూ.2లక్షల రూపాయల నగదు, ఇతర విలువైన వస్తువులను కొత్త బట్టలను తన బ్యాగ్ లోకి మార్చుకుంది. రాజ్యలక్ష్మితో పాటు వచ్చిన యువతి హైదరాబాద్ లో ఉన్న తన సోదరుడ్ని కలవాలి… తాను వెళ్లిపోతానని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంది. ఈలోగా రాజ్యలక్ష్మి తనకు తలకాయ నొప్పిగా ఉందని ట్యాబ్లెట్లు తెచ్చిపెట్టాలని భర్తను కోరింది. సరే అని రమణారెడ్డి మందుల షాపుకు వెళ్లాడు.
Also Read : Helmet Must : హెల్మెట్ రూల్ లైట్ తీసుకుంటే తప్పదు కేసు : పోలీసుల వార్నింగ్
అతను తిరిగి వచ్చే సరికి కొత్త పెళ్ళి కూతురు, ఆమెతో పాటు వచ్చిన మరో మహిళ ఇద్దరూ ఇంటినుంచి పరారయ్యారు. రమణా రెడ్డి ఇంట్లో చూసుకోగా బీరువాలోని రెండు లక్షల నగదు, ఆరోజు కొనుగోలు చేసిన 3 తులాల బంగారం గొలుసు కొత్త బట్టలు మాయమయ్యాయి. కారు కూర్మిద్ద నుంచి ఇంజాపూర్ సమీపంలోకి వచ్చేలోగా వారిద్దరూ కారులోనే బట్టలు మార్చుకోవటం గమనించిన కారు డ్రైవర్ కు అనుమానం వచ్చి వారిని ఇదేంటని ప్రశ్నించాడు. దాంతో వారు అతడ్ని బెదిరించారు.
ఎల్బీనగర్ రాగానే కారు దిగి పోయి విజయవాడ వైపు వెళ్లే వాహనం ఎక్కి వెళ్లిపోయారు. బాధిత పెళ్లికొడుకు స్థానిక పెద్దలకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. మధ్యవర్తిని నిలదీయగా ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని అన్నట్లు సమాచారం. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు… చూడాలి మరి ఈ కేసు చిక్కుముడి ఎలా వీడుతుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.