Tamilnadu : టికెట్ తీసుకోమన్నందుకు కండక్టర్ పై దాడి, మృతి
తమిళనాడులో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని టికెట్ తీసుకోమన్నందుకు ఆ వ్యక్తి కండక్టర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కండక్టర్ మరణించాడు.
Tamilnadu : తమిళనాడులో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని టికెట్ తీసుకోమన్నందుకు ఆ వ్యక్తి కండక్టర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కండక్టర్ మరణించాడు.
చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి విల్లుపురంకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధకు చెందిన బస్సు తెల్లవారుఝూమున సుమారు గం.3-20 సమయంలో బయలుదేరింది. బస్సులో పెరుమాళ్ అనే వ్యక్తి కండక్టర్ గా ఉన్నాడు. బస్సు 4 గంటల సమయంలో మధురాంతకం బస్టాండ్ లో కొంత మంది ప్రయాణికులను ఎక్కించుకుని బయలు దేరింది.
ఆ ఎక్కిన వారికి టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్ ఒక వ్యక్తి వద్దకు వచ్చి టికెట్ తీసుకోమని కోరాడు. ఆ వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి ఉన్నాడు. అతడు టికెట్ తీసుకోకుండా కండక్టర్తో వాగ్వాదానికి దిగాడు. ఎంతకీ టికెట్ తీసుకోకపోవటంతో అతడ్ని బస్సు దించేందుకు కండక్టర్ ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికుడు కండక్టర్ పెరుమాళ్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. డ్రైవర్ బస్సు ఆపటంతో మద్యం సేవించిన వ్యక్తి దిగి పారిపోయాడు.
డ్రైవర్ కండక్టర్ ను పరిశీలించగా కండక్టర్ అపస్మారక స్ధితిలోకి చేరుకున్నాడు. వెంటనే బస్సును మేల్ మరువత్తూరు లోని ఒక ఆసుపత్రికి తరలించి కండక్టర్ ను ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటికే కండక్టర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
కండక్టర్ పై దాడి చేసిన మురుగన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మురుగన్ కూలీ పని చేసుకునేవాడని…. మద్యానికి బానిసై కండక్టర్ పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రసంతాపం తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన కండక్టర్ పెరుమాళ్ కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
రవాణా శాఖ మంత్రి ఎన్ఎన్ శివశంకర్ కల్లకురిచ్చిలోని పెరుమాళ్ ఇంటికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ఇచ్చిన రూ. 10 లక్షల రూపాయలను అందించారు.
Also Read : Ganja Seized : కోదాడలో 36 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్