పావుగంట నడకతో ప్రాణాలు, పైసలు భద్రం : బద్ధకిస్తే రోగాలకు ‘టులెట్‌’ బోర్డు పెట్టినట్లే: సర్వేలో ఆసక్తికర విషయాలు

  • Published By: nagamani ,Published On : December 1, 2020 / 12:50 PM IST
పావుగంట నడకతో ప్రాణాలు, పైసలు భద్రం : బద్ధకిస్తే రోగాలకు ‘టులెట్‌’ బోర్డు పెట్టినట్లే: సర్వేలో ఆసక్తికర విషయాలు

15 minute daily walk could boost..money and health safety : ప్రతీరోజు నడక..ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఆరోగ్యం కావాలి అంటే నడవాల్సిందేనంటున్నారు నిపుణులు. ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు మారాలి అంటే మన జీవనశైలిని మార్చుకోవాలి. మన రోజువారీ పనులతో పాటు జీవితంలో నడకను ఓ భాగంగా మార్చుకోవాలి. ఉదయం సమయంలో పచ్చని చెట్లను చూస్తూ..ఎండలో నడిస్తే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది.



నడక దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది : ప్రపంచ ఆరోగ్యం సంస్థ
నడక కేవలం ఆరోగ్యానికే కాదు..కుటుంబానికి తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆయా దేశ ప్రజల ఆరోగ్యం ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని మరోసారి పునరుద్ఘాటించింది. వ్యాయామానికి, వాకింగ్‌లకు దూరంగా ఉంటే శరీరం జబ్బులకు నిలయంగా మారిపోతుందని..రోగాలు రండి అన్నట్లుగా రోగాలకు ‘టులెట్‌’ బోర్డు పెట్టినట్లేనని ఓ సర్వేలో వెల్లడైంది. నేటి బిజీ బిజీ జీవితంలో నడక కోసం సమాయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితమే. మళ్లీ ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకునేసరికి అలసిపోతాం. ఇక నడక అనే మాటే ఉండదు. దీంతో మనకు తెలియకుండానే మనం రోగాలను ఆహ్వానిస్తున్నాం అని నిపుణులు చెబుతున్నారు.



ముఖ్యంగా ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. అటు ఉద్యోగ బాధ్యతలు..ఇటు ఇంటి బాధ్యతలకు తోడు చాలా తక్కువ సమయంలోనే మేమున్నాం అంటూ ఆరోగ్యం సమస్యలు వచ్చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న జబ్బు వచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే.. అంతవరకు కష్టపడి సంపాదించింది క్షణాల్లో కరిగిపోతున్న సందర్భాల్ని చూస్తునే ఉన్నాం.



ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న రోగాలు..హెచ్చరిస్తున్న నిపుణులు

ముఖ్యంగా హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగాల్లో పనిచేసే లక్షలాది మందిలో చాలా వరకూ కంప్యూటర్ల మీదనే పనిచేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయనే చాలా సర్వేల్లో తేలింది. కానీ కాస్త సమయం మనం ‘నడక’కోసం కేటాయిస్తే..చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చనీ..తద్వారా మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయని..దాంతో పాటు రోగాలకు దూరంగా ఉండటంతో ఇంటికి ఆదాయం పెరుగుతుంది. తద్వారా దేశ ఆర్థికాభివృద్ది కూడా మెరుగుపడుతుందని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.



పావుగంట నడిస్తే ప్రాణాలు..పైసలు భద్రం
చిన్నపాటి జబ్బుతో ఆసుపత్రికి వెళ్లామా..ఆస్తులు అమ్ముకుంటే గానీ అక్కడనుంచి బైటపడే పరిస్థితిలేదు. ప్రాణాలతో క్షేమంగా తిరిగి వస్తాడన్న గ్యారెంటీ కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకే చాలా వరకూ రోగాలు రాకుండా నడక చాలా చాలా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీరోజూ కనీసం 15 నిమిషాలు నడక చాలా సర్వసాధారణంగా మారిపోతున్న బీపీ, డయాబెటిస్, ఒబెసిటీ వంటి సమస్యల్ని దూరం పెడుతుందని సర్వే చెబుతోంది. నడకతో శరీరం చక్కగా రికాక్స్ అవుతుంది. దీంతో ప్రతీ ఉద్యోగి వర్క్ లో ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నారని..మెరుగైన పనితనాన్ని కనిపిస్తున్నట్లు కూడా సర్వే గుర్తించింది.



వాకింగ్ చేస్తే హాస్పిటల్ కు వెళ్లక్కర్లా..
ఇలా ప్రతీరోజూ వాకింగ్, జాగింగ్‌ చేసే వారు ఆసుపత్రులకు తక్కువగా వెళ్తున్నారని..ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని భద్రంగా ఉంచుకుంటూ..ఆయుషులను కూడా పెంచుకుంటున్నారని సర్వేలో తేలింది. ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 60ఏళ్లు మధ్యవారిలో రోజుకు 15 నిమిషాలు నడవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ప్రకటించింది. మన కరెన్సీలో దాదాపు రూ.73 లక్షల కోట్లు ఉంటుందని తెలిపింది.



100మందిలో 30 శాతం బద్ధకస్తులే..
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 100 మందిలో 30శాతం మంది బద్ధకస్తులేనని..వాళ్లు ఎటువంటి ఫిజికల్ ఏక్టివిటీ లేకుండా గడిపేస్తున్నారనీ..సర్వేలో తేలింది. ఈ 30శాతం మంది ఐటీ, ప్రైవేటు ఉద్యోగ జీవితాల వల్ల వ్యాయామానికి దూరంగా ఉన్నారు. వీరిలో ఏటా 50 లక్షల మంది వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతోనే మరణిస్తున్నారని సర్వే తేల్చిచెప్పింది.ఈ లెక్కన చూసుకుంటు నడక ఎంత అవసరమో ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం చాలా ఉందని సర్వే నిర్వాహకులు సూచిస్తున్నారు. కదలకుండా పనిచేసే ఉద్యోగులు ఇక ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచిదని హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగిందని, ఇప్పటికైనా మేల్కొనాలని హెచ్చరిస్తున్నారు.



నడకతో షుగర్, బీపీ, గుండె జబ్బులు దూరం
భారతీయులు ఉద్యోగాల్లో ఎదురయ్యే ఒత్తిడితో కారణంగా బీపీ, షుగర్,గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు బారినపడుతున్నారు. నడవడం వల్ల కండరాలు బలోపేతమవడంతో పాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యంతో పాటు చక్కటి ఆలోచనలు వస్తాయి. దీంతో పని ఒత్తిడి దూరమవుతుంది. ప్రతి ఉద్యోగి మెరుగైన పనితీరును కనబరిచే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న దూరాలకు కూడా వాహనం వేసుకుని వెళ్లటం మానేసి నడిచే వెళ్లడం, లిఫ్ట్‌ ఎక్కకుండా మెట్లు ఎక్కటం,సాధ్యమైనంత వరకూ ఇంటి పని, వంట పని, తోటపనులు స్వయంగానే చేసుకుంటే శరీరానికి చక్కటి వ్యాయామం జరిగి చక్కటి నిద్ర పడుతుంది.



వాకింగ్ తో ఆరోగ్యం మీ సొంతం
సుఖనిద్రతో లేచేసరికి మనస్సు..శరీరం చక్కగా ఉత్సాహంగా ఉంటాయి. దీంతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మన సొంతమవుతోంది .రోగాలుకూడా దరి చేరకపోటంతో హాస్పిటల్ టెన్షన్లు తగ్గుతాయి. డబ్బులు ఆదా అవుతాయి. చూశారా? కేవలం 15 నిమిషాల నడక మన జీవితంలో ఎంతటి సంతోషాన్నిస్తుందో..అలా క్రమం క్రమంగా 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు అలా నడక వీలును బట్టి పెంచుకుంటూ రోగాలకు దూరం..ఆనందానికి ఆరోగ్యానికి దగ్గరవుతామన్నమాట..మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే నడక మొదలు పెట్టండీ..ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి అంటున్నారు నిపుణులు.