కోడెల సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్: మిస్సైన ఫోన్ లో చివరిగా ఎవరితో మాట్లాడారు?
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకోగా.. ఆదివారం ఉదయం 8గంటల 30నిమిషాలకి కోడెల శివప్రసాద్ ఫోన్ నుంచి చివరి కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడినట్టు దర్యాప్తులో తెలిసింది. సోమవారం సాయంత్రం 5గంటలకు ఫోన్ స్విచాఫ్ అయినట్లు తెలుస్తుంది. కోడెల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే కోడెల ఫోన్ మిస్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. కోడెల నివాసంలో వేలిముద్రలను ఇప్పటికే సేకరించింది క్లూస్ టీమ్.. కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేసుకున్నారు.
అయితే కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత మొబైల్ కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోడెల కూతురు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కోడెల ఫోన్ ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. ఎస్ఎంఎస్లను పరిశీలిస్తున్నారు.