ఇంటర్ పరీక్ష పత్రాల్లో తప్పులు: వాటిని టచ్ చేస్తే మార్క్‌లు

  • Published By: vamsi ,Published On : March 17, 2020 / 08:59 PM IST
ఇంటర్ పరీక్ష పత్రాల్లో తప్పులు: వాటిని టచ్ చేస్తే మార్క్‌లు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో తప్పులు కనిపించాయి.  అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు ప్రశ్నలకు జవాబులు రాయడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం కామర్స్‌ తెలుగు మీడియం ఓల్డ్‌ సిలబస్‌లో 3 ప్రశ్నలు తప్పుగా ఉండగా.. వాటిని గుర్తించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు.

అయితే తప్పుగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాస్తే (తప్పైనా, ఒప్పైనా) టచ్ చేసినందుకు వారందరికీ మార్కులు ఇస్తామని వెల్లడించారు. ఈ పరీక్షలు రాసేందుకు 5,03,429 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 4,78,987 మంది హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు పూర్తవగా.. మార్చి 19, 21 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ద్వితీయ సంవత్సర ప్రధాన పరీక్షలు మార్చి 18తో పూర్తి కానున్నాయి. 20, 23 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉండనున్నాయి.

ప్రశ్నాపత్రాల్లోని తప్పులు:
– కామర్స్‌–1 తెలుగు మీడియం (ఓల్డ్‌ సిలబస్‌) సెక్షన్‌–డి 18వ ప్రశ్నలో డెబిట్‌ వైపు అప్పులకు బదులుగా క్రెడిట్‌ నిలువలు అని ఉండాలి.

– తెలుగు మీడియం (న్యూ సిలబస్‌) కామర్స్‌–1లో 16వ ప్రశ్నలో నిలి అని ఉంది. అక్కడ నిలిపి అని ఉండాలి. 

– సెక్షన్‌–ఈ 19వ ప్రశ్నలో తేదీ 8లో చెక్కును బ్యాంకులో డిపాజిట్‌ చేశారు అని ఉండాలి.  

– సెక్షన్‌–ఎఫ్‌లో 22వ ప్రశ్నలో తేదీ 5న వంశీకి అమ్మిన సరుకుకు బదులుగా వంశీ నుంచి కొన్న సరుకు అని ఉండాలి. అలాగే తేదీ 10లో వంశీకి అమ్మిన సరుకు రూ.1,200 అని ఉండాలి అది ప్రింట్‌ కాలేదు.  

– సెక్షన్‌–ఎఫ్‌లో 23వ ప్రశ్నలో 2018 అని పొరపాటుగా వచ్చింది.  

– సెక్షన్‌–జీలో 31వ ప్రశ్నలో రుణగ్రస్తులు రూ.28,000 అని ఉండడానికి బదులుగా రూ.22,000 అని వచ్చింది. 

– కెమిస్ట్రీ–1లో (ఇంగ్లిష్‌ మీడియం) సెక్షన్‌–బి 14వ ప్రశ్నలో ప్రశ్న చివరలో తప్పు ఉంది.

– సెక్షన్‌–జీలో 27వ ప్రశ్నలో తప్పు ఉంది.

– కెమిస్ట్రీ–1లో (తెలుగు మీడియం) సెక్షన్‌–బీలో 15వ ప్రశ్నలో 10.6 శాతానికి బదులుగా 10.06 శాతం అని ఉండాలి. 

– సెక్షన్‌–బీలో 16వ ప్రశ్నలో తప్పు కనిపించింది. 

అంతకుముందు ఇంగ్లీష్ పేపర్లో కూడా తప్పులు దొర్లినట్లుగా ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు.