ఢిల్లీ గులాములు కావాలా..గులాబీలు కావాలా – KTR
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్, మోదీకి లాభమని… TRS ఎంపీలు గెలిస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 71 ఏళ్ల పాటు దేశాన్ని జాతీయ పార్టీలే పాలించాయని.. అయినా అభివృద్ధి చేయలేకపోయాయాయన్నారు. మార్చి 29వ తేదీ శుక్రవారం కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్… గోదావరి జలాలను తేవడానికి భగీరథ ప్రయత్నం నడుస్తోందన్నారు. కాళేశ్వరం ద్వారా సిరిసిల్ల ప్రాంతానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలను నీరందిస్తామని స్పష్టం చేశారు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు
రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, కరీంనగర్లో జరిగిన రోడ్షోలలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో TRS ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం జరుగుతుందని, ఎంపీలను ఢిల్లీకి పంపించి తెలంగాణ హక్కులను సాధించుకుందామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే రాహుల్కు, మోదీకి లాభం జరుగుతుందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఢిల్లీలో ఎగురవేసి… ఎర్రకోటపై ఎవరు జెండా ఎగురవేయాలో నిర్ణయించే శక్తిని టీఆర్ఎస్కు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ నుంచి 16 సీట్లు టీఆర్ఎస్ గెలిస్తే దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి 170 సీట్లతో ఢిల్లీని శాసించే సత్తా టీఆర్ఎస్కు ఉంటుందన్నారు. ఢిల్లీ మెడలు వంచే మొనగాడు కేసీఆర్ అని అన్నారు. రాహుల్, మోదీ వాళ్లిద్దరి మధ్యనే ప్రధాని పదవి ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ గులాములు కావాలో తెలంగాణ గులాబీలు కావాలో నిర్ణయించుకోవలసింది ప్రజలేనని స్పష్టం చేశారు.
Read Also : YSRCP అధికారంలోకి వస్తే : 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ – జగన్