హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ : JBS-MGBS మెట్రో రైలు ప్రారంభం

  • Published By: chvmurthy ,Published On : February 7, 2020 / 02:23 AM IST
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ : JBS-MGBS  మెట్రో రైలు ప్రారంభం

హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ప్రాజెక్టులో మరో ముఖ్యమైన ఘట్టం శుక్రవారం చోటుచేసుకోనుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (JBS-MGBS) మధ్య మెట్రో సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7,శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. దీంతో HMR మొత్తం పొడవు 67 కిలోమీటర్లకు పెరగనుంది. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తయింది. 

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గత 45 రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించారు.  Metro Rail  భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు కూడా పొందింది. నాగోల్-హైటెక్ సిటీ కారిడార్ 29 కిలోమీటర్లు, మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్ 29 కిలోమీటర్లు ప్రస్తుతం మెట్రో రైలు నడుస్తుండగా.. మూడో కారిడార్ JBS-MGBS వరకు 11 కిలోమీటర్ల వరకు  నేడు అందుబాటులోకి రానుంది. రెండు అతిపెద్ద బస్టాండ్‌లను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఇవాళ్టి నుంచి సేవలు అందించనుంది. 

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రో కోసం ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొదట సంక్రాంతి నాటికి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ మార్గం ప్రారంభోత్సవం ఆలస్యమైంది. ఇప్పటికే నడస్తున్న మార్గాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగానే ఉంది. ట్రాఫిక్ చిక్కుకుని సమయం వృథా చేసుకోవడం కంటే మెట్రోను ఆశ్రయిస్తే మేలని ప్రజలు భావిస్తుండడంతో ట్రైన్లలో ఫుల్ రష్‌ కనిపిస్తోంది. 

JBS-MGBS సర్వీసు ప్రారంభం అవటంతో హైదరాబాద్‌ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్‌ వైఎంసీఏ కూడలి దగ్గర ఉన్న ఫ్లైఓవర్‌కు సమాంతరంగా నాగోల్‌ స్టేషన్‌ నుంచి రాయిదుర్గంకు వెళ్లే మెట్రో రైలు మార్గాన్ని కారిడార్‌-3లో నిర్మించారు. ఈ రెండు నిర్మాణాల పై భాగం నుంచి వెళ్లేందుకు జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గాన్ని  63 అడుగుల ఎత్తులో నిర్మించారు. మెట్రో ప్రాజెక్టులో ఇదే అత్యంత ఎత్తయిన రైలు మార్గం. 

హెచ్‌ఎంఆర్ ఇప్పటికే ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-మియాపూర్ లైన్లను నడుపుతున్న విషయం విదితమే. హెచ్ఎంఆర్ మొదటి దశలో భాగమైన నాగోల్-అమీర్‌పేట-మియాపూర్ మార్గంతో 2017 నవంబరులో ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్బీ నగర్ అమీర్‌పేట మార్గాన్ని 2018 అక్టోబరులో ప్రారంభించారు. అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గాన్ని 2019 మార్చిలో ప్రారంభించారు. దేశంలోనే రెండవ పెద్ద మెట్రోగా హెదరాబాద్ మెట్రో గుర్తింపు పొందింది.

మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మెట్రోలో కేవలం 52 నిమిషాలు మహా అయితే గంటలో చేరుకుంటున్నారు. అదే కార్లు, స్కూటర్లయితే రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. నాగోల్‌ నుంచి రాయిదుర్గం కేవలం 52 నిముషాల్లో చేరుకుంటున్నారు. ప్రధాన రహదారికి నడుమ నాజూకైన ఒంటి వరుస స్తంభాలపై, బ్యాలెన్స్‌డ్‌ క్యాంటిలివర్‌ డిజైన్‌లో, ప్రీ కాస్ట్‌ పద్ధతిలో మెట్రోరైలు నిర్మాణం పూర్తి చేశారు. ఇది మన ఇంజనీర్ల ప్రతిభకు, గుండె ధైర్యానికీ నిదర్శనం. చరిత్రలో చిరకాలం నిలిచిపోయే ఒక ఆద్భుత ఇంజినీరింగ్‌ ప్రయోగమని చెప్పాలి. తక్కువ స్థలంలో, అత్యంత వేగంగా మెట్రో స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు. 

అమీర్‌పేట ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ దేశంలోని మెట్రో స్టేషన్లన్నింటికంటే అతి పెద్దది. విశాలమైంది. ఈ స్టేషన్‌ పొడవు 476 అడుగులు, 148 అడుగుల వెడల్పు. హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ – సైబరాబాద్‌లను కలుపుతోంది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ స్టేషన్‌ను మూడు అంతస్థుల్లో భూమి నుంచి 112 అడుగుల ఎత్తులో నిర్మించారు. 12 ఎస్కలేటర్లు, 18 లిప్టులు, 12 మెట్ల మార్గాలున్నాయి. ఇక ఎంజీబీఎస్‌ దగ్గర మెట్రోస్టేషన్‌ను భూమికి సుమారు 63 అడుగుల ఎత్తులో, ఐదు అంతస్థు ల్లో నిర్మించారు.