Blood Clot : కరోనా సోకినవారికి కొత్త ముప్పు
కరోనా టీకాల వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే..
Blood Clot : కరోనా టీకాల వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే.. కరోనా సోకిన వారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువని తేల్చారు. ఈ మేరకు జరిపిన అధ్యయన ఫలితాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు.
ఆక్స్ఫర్డ్, లేసెస్టర్, కేంబ్రిడ్జి, ఎడిన్బర్గ్, నాటింగ్హామ్ విశ్వవిద్యాలయాలు సహా ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా తొలి డోసు తీసుకున్న మొత్తం 2.9 కోట్ల మందిపై ఈ అధ్యయనం చేశారు. డిసెంబర్ 1, 2020- ఏప్రిల్ 24, 2021 మధ్య ఈ పరిశోధన జరిగింది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ ముప్పు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో మరింత ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. పైగా వీరిలో దీర్ఘకాలం ఈ సమస్య ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా.. వెంటనే వైద్యసాయం తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. అలాగే కరోనా సోకిన వారు సైతం దీర్ఘకాలం అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. తద్వారా రక్తం గడ్డ కట్టే ముప్పును ముందే పసిగట్టి నివారణ కోసం చికిత్స చేసే అవకాశం ఉంటుందన్నారు.
కాగా, ఆస్ట్రాజెనికా వాడకాన్ని అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధులకే పరిమితం చేశాయి. యువతకు రక్తం గడ్డకట్టే అవకాశాలు ఈ వ్యాక్సిన్తో ఎక్కువగా ఉన్నాయనే పరిశోధనలే ఇందుకు కారణం.