బ్రెజిల్‌ అధ్యక్షుడికి సోకిన కరోనా

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 12:08 AM IST
బ్రెజిల్‌ అధ్యక్షుడికి సోకిన కరోనా

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనేవున్నాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా సోకింది. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం (జులై 7, 2020) ధృవీకరించారు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన బ్రెసిలియాలోని ప్యాలెస్ లో తన మద్దతుదారులతో మాట్లాడారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.

మార్చిలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చాలా మంది సభ్యులు వైరస్ బారిన పడటంతో బోల్సోనారోకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో మూడుసార్లు నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. బ్రెజిల్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తూ మరణమృదంగం మోగిస్తున్నా లాక్ డౌన్ ప్రకటించేందుకు ససేమిరా అన్న బోల్సోనారో వివాదానికి తెరతీశారు.

కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 65,000 మందికి పైగా బ్రెజిలియన్లు మరణించగా 1,500,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు.

Read Here>>ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా