Myanmar : మయన్మార్ హింసాత్మకం…కాల్పుల్లో ఇప్పటి వరకు చనిపోయింది 320 మంది
మయన్మార్లో సెక్యూరిటీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 300 దాటింది.
Death toll in Myanmar : మయన్మార్లో సెక్యూరిటీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 300 దాటింది. ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత మయన్మార్లో సైన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు పలుచోట్ల కాల్పులకు దారితీశాయి. ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారుల్ని అణిచివేస్తున్న జుంటా సైన్యం భారీగా కాల్పులకు తెగించింది.
మరణించిన వారిలో 90 శాతం మంది బాధితులు బుల్లెట్లకే ప్రాణాలు కోల్పోయినట్లు మావనహక్కుల సంఘం ద్వారా వెల్లడైంది. దాంట్లో నాల్గవ వంతు నిరసనకారులు.. తలలో కాల్చడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. అయితే సైనిక అధికారులు మాత్రం 164 మంది నిరసనకారులు మరణించినట్లు చెబుతున్నారు. ఆందోళనకారులు దాడుల్లో 9 మంది భద్రతా దళ సభ్యులు మృత్యువాత పడ్డారు.
మయన్మార్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను పాశ్చాత్య దేశాలు ఖండించాయి. పౌరులపై సైన్యం క్రూరమైన అణివేతకు దిగడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ గ్రూపు సేకరించిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు మయన్మార్లో 320 మంది మరణించారు. సుమారు మూడవ వేల మంది అరెస్టు అయ్యారు. చనిపోయిన వారిలో 90 మంది మగవాళ్లే ఉన్నారు. 24 ఏళ్లు లేదా అంత కన్నా తక్కువ వయసున్న వారిలో 36 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది.