Afghanistan : ప్రజాస్వామ్యం ఉండదు..షరియా మాత్రమే..తాలిబన్ క్లారిటీ

అప్ఘానిస్తాన్‌లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని...అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ సంస్థ సృష్టం చేసింది.

Afghanistan : ప్రజాస్వామ్యం ఉండదు..షరియా మాత్రమే..తాలిబన్ క్లారిటీ

Afghan (2)

Taliban అప్ఘానిస్తాన్‌లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని…అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ సంస్థ సృష్టం చేసింది. తాలిబన్ లీడర్ షిప్ కౌన్సిల్ ద్వారా అప్ఘానిస్తాన్ లో ఇకపై పరిపాలన సాగనుందని స్పష్టం చేశారు. తాలిబన్​ సుప్రీం లీడర్​ హోదాలో హైబతుల్లా అఖుండ్​జాదా వ్యవహరిస్తారని ఆ సంస్థ ప్రతినిధి వహిబుల్లా హషీమీ ఓ ఆంగ్ల వార్త సంస్థకు వెల్లడించారు.

అయితే అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ కౌన్సిల్‌ పాలన కొత్తేమీ కాదు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్‌ చీఫ్‌గా ముల్లా ఒమర్‌ వ్యవహరించారు. ఆయన చాలా కాలం అజ్ఞాతంలోనే ఉన్నారు. రోజువారీ పాలన మాత్రం కౌన్సిల్‌ చూసుకొనేది. అదే విధంగా ఇప్పుడు కూడా అఖుండ్‌జాదా కౌన్సిల్‌ పై స్థానంలో ఉంటారు. ఆయన కింద ఉన్న వ్యక్తి అధ్యక్షుడి బాధ్యతలను నిర్వహిస్తారు. అఖుండ్‌జాదా కింద అబ్దుల్‌ ఘనీ బరాదర్‌, మౌల్వీ యాకూబ్‌, సిరాజుద్దీన్‌ హక్కానీ ఉన్నారు. అయితే పాలనకు సంబంధించిన చాలా అంశాలపై తాలిబన్లు ఓ నిర్ణయానికి రాలేదని వహిబుల్లా హషీమీ తెలిపారు. షరియా చట్టం అమలు ఉంటుదని సృష్టం చేశారు.

మరోవైపు,ఇప్పటికే తాలిబన్లు.. అప్ఘాన్ పైలట్లు, సైనికులను కూడా సంప్రదించి వారిని విధుల్లో చేరాలని సూచించినట్లు వహిబుల్లా హషీమీ తెలిపారు. సైన్యంలో సంస్కరణలు చేయాల్సి ఉందని కానీ వారు తమకు అవసరమని వహిబుల్లా హషీమీ తెలిపారు. ప్రభుత్వ, తాలిబన్‌ బలగాలను కలిపి ఓ సైన్యం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు హషీమీ తెలిపారు. అప్ఘాన్ సైన్యంలో విదేశాల్లో శిక్షణ పొందిన వారు ఉండటంతో వారిని విధుల్లోకి తీసుకొంటున్నట్లు తెలిపారు. కాగా, గతంలో అమెరికాలోని ట్విన్‌ టవర్లపై విమానాలతో దాడికి తాలిబన్లు ఆశ్రయం ఇచ్చిన అల్‌ ఖైదా ఉగ్రసంస్థే కారణం. ఇప్పుడు తాలిబన్ల దగ్గరకు శిక్షణ పొందిన పైలట్లు వస్తే వారిని ఎలా వినియోగించుకొంటారో తెలియని పరిస్థితి.

ఇక,పొరుగు దేశాల్లో ఉన్న అప్ఘానిస్తాన్ కి చెందిన 22 విమానాలు, 24 హెలికాప్టర్లను తిరిగి ఇవ్వాలని కోరుతున్నట్లు వహిబుల్లా హషీమీ చెప్పారు. తాలిబన్లు గత ఆదివారం రాజధాని కాబుల్‌లోకి ప్రవేశించడంతో కాబూల్ లోని హమీద్‌ ఖర్జాయ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా ఇచ్చిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను పొరుగుదేశం ఉజ్బెకిస్తాన్‌లోని తర్మీజ్‌ ఎయిర్‌ పోర్టుకు తరలించిన విషయం తెలిసిందే.