Lock down in China: చైనాలో కరోనా లాక్ డౌన్: ఆహార కేంద్రాలను దోచుకువెళ్తున్న ప్రజలు
ప్రభుత్వం విధించిన కఠిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు కనీస అవసరాలకు నోచుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ బాధలు తట్టుకోలేని ప్రజలు సమీప ఆహార కేంద్రాలను దోచుకు వెళ్తున్నారు
Lock down in China: కరోనా మహమ్మారి మరోమారు చైనాను అతలాకుతలం చేస్తుంది. కరోనా పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనాలో మహమ్మారి వ్యాప్తి ప్రారంభ రోజులతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఇటు ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. 2019లో మధ్య చైనా ప్రాంతంలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా మహమ్మారి..రోజుల వ్యవధిలోనే ప్రపంచమంతా విస్తరించి..అల్లకల్లోల్లం సృష్టించింది. అదే సమయంలో చైనాలోని తూర్పు ప్రాంతంలో మాత్రం పెద్దగా ఛేఒప్పుకోతగ్గ స్థాయిలో కరోనా కేసులు బయటపడలేదు. అయితే ప్రస్తుతం చైనా తూర్పు ప్రాంతంలోనే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తూర్పు తీరంలోని షాంఘై మహానగరం సహా 23 మధ్య – చిన్న స్థాయి నగరాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులే అధికంగా నమోదు అవుతున్నట్లు అక్కడి వైద్యాధికారులు గుర్తించారు.
Also read:PM MoDi : ‘WTO అనుమతిస్తే ప్రపంచానికి ఆహారం అందించటానికి భారత్ సిద్ధంగా ఉంది’..
ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒక్క షాంఘై నగరంలోనే నిత్యం 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దాదాపు రెండున్నర కోట్ల మంది జనాభా ఉన్న షాంఘై నగరంలో అధికారులు కఠిన లాక్ డౌన్ విధించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హుకుం జారీచేశారు. రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే స్తంభించింది. విదేశీ విమాన రాకపోకలపై షాంఘై నగరపాలక సంస్థ అధికారులు నిషేధం విధించారు. చైనాతో పాటు ప్రపంచ ఆర్ధిక రాజధానిగా పిలువబడే షాంఘై నగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. గత 23 రోజులుగా ప్రభుత్వం విధించిన కఠిన లాక్ డౌన్ కారణంగా..ప్రజలు కనీస అవసరాలకు నోచుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ బాధలు తట్టుకోలేని ప్రజలు సమీప ఆహార కేంద్రాలను దోచుకు వెళ్తున్నారు.
కనీసం త్రాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితుల్లో షాంఘై నగరవాసులు ఆర్తనాదాలు పెడుతున్నారు. షాంఘై సహా 23 నగరాల్లో విధించిన లాక్ డౌన్ కారణంగా సుమారు 20 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడింది. ఇదిలాఉంటే “జీరో కోవిడ్ పాలసీ” దిశగా ప్రయత్నిస్తున్న చైనాలో తిరిగి మునుపటికంటే కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. గతంలో మాదిరిగానే మహమ్మారి వ్యాప్తిపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందా? అనే వాదనా వినిపిస్తుంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు గమనిస్తూ..WHOతో సంబంధం లేకుండా ముందుగానే జాగ్రత్త వహించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.