Ghosts Snails : అమెరికాను వణికిస్తున్న‘నత్త’లు..ఫ్లోరిడాలో కొత్త రకం లాక్​ డౌన్..!

నత్తలు..అమెరికాను వణికిస్తున్నాయి. అమెరికాలో ఏకంగా నత్తలు జనాలను నానా తిప్పలు పెడుతున్నాయి. ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి.

Ghosts Snails : అమెరికాను వణికిస్తున్న‘నత్త’లు..ఫ్లోరిడాలో కొత్త రకం లాక్​ డౌన్..!

Ghosts Snails In America (1)

Ghosts Snails In America : నత్తలు..అమెరికాను వణికిస్తున్నాయి. నత్త అంటే చిన్నగా ఉంటుంది అవి అగ్రరాజ్యం అయిన అమెరికాను వణికించటం ఏంటా?అనుకోవచ్చు. కానీ చిన్నపాటి మిడత కూడా దేశాలకు దేశాలనే వణికించిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు అమెరికాలో ఏకంగా నత్తలు జనాలను నానా తిప్పలు పెడుతున్నాయి. ఏకంగా ఎలుకల సైజు అంత ఉన్న నత్తలు ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి. ఈ నత్తల గోలేంటీ? వాటితో వచ్చిన సమస్యలేంటో చూద్దాం..

‘జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్’ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. ఎనిమిది అంగుళాల పొడవు ఉండే ఈ నత్తలు ఆయుషు కాలం తొమ్మిదేళ్లు. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. కాగా ఈ నత్తలు ఆఫ్రికా దేశాలకే పరిమితమై ఉండేవి. కానీ మనుషులతో పాటు పలు సందర్భాల్లో దేశాలు దాటేసి అమెరికా చేరుకున్నాయి. 1960 సమయంలో ఓడల్లో సరుకుల ద్వారానో, పెంచుకునేందుకు, తినేందుకు తెచ్చుకునే మనుషుల ద్వారానో ఎలాగైతేనే అమెరికాకు చేరాయి ఈ రాకాసి నత్తలు. అలా తమ సంతతిని బాగా పెంచేసుకున్నాయి. అలా పెరిగి పెరిగిన ఈ నత్తలు అమెరికాకు తలనొప్పిగా మారాయి.

మొదట అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో 1960లో ఈ నత్తల సంతతి విజృంభించింది. అప్పట్లోనే ఆ ప్రదేశంలో నత్తలను నిర్మూలించేందుకు 10 ఏళ్ల పాటు కఠిన చర్యలే తీసుకున్నారు. వీటి కోసం ఏకంగా రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి గుడ్ల ద్వారా చాలా ప్రదేశాల్లో మరోసారి విజృంభిస్తూ వస్తున్నాయి.

ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది..ఈ పన్నెండు వందల నత్తలు ఒక్కోటీ 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయన్నమాట.ఈ నత్తలు దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి పంట అయినా దెబ్బతినటం ఖాయం. పంటల్ని నాశనం చేస్తుంటాయి. ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. (మెదడుకు నీరు పట్టి.. తలనొప్పి, తీవ్ర జ్వరం, కండరాల బలహీనత, వణుకు, ఫిట్స్, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు..). ఈ నత్తలు ఎంతటి ప్రమాదానికి కారణమవుతాయంటే..ఏకంగా కాంక్రీట్ ను కూడా తింటాయని.. దీనితో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది.

సహజ శత్రువులు లేకపోవడంతో విజృంభిస్తూ..
ఏ జీవికి అయినా వాటి సాధారణ ఆవాసంలో సహజ శత్రువులు ఉంటాయి. అందువల్ల వాటి సంతతి నియంత్రణలో ఉంటుంది. ఇది ప్రకృతి సహజంగా ఉండేదే. అదే శత్రువులు అనేదే లేకపోతే ఏ ప్రాణికి అయినా వాటి సంతతి భారీగా పెరుగుతుంది. ఏదైనా జీవి పూర్తిగా కొత్త ప్రాంతానికి వెళితే.. సహజ శత్రువులు లేకపోతే వాటి సంతతి పెరిగిపోతుంది. ఆస్ట్రేలియాలో కుందేళ్లు, యూరప్ దేశాల్లో పాముల సంతతి ఇలాగే విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అమెరికాకు ఆఫ్రికన్ జెయింట్ నత్తలు కూడా అలాగే ఉంది. ఇవే అమెరికాకు పెద్ద సమస్యగా మారాయి.

నత్తల వల్ల లాక్ డౌన్ ఏంటి..?
ఇటీవల ఫ్లోరిడాలోని పోర్ట్ రిచీ పట్టణంలో జెయింట్ నత్తలను గుర్తించారు. ఈ నత్తల గుడ్లు మట్టి, మొక్కలు, కలప తరలింపు వంటి మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉండటంతో వెంటనే ఆ ప్రాంతంలో రెండేళ్ల పాటు ఒక రకం లాక్ డౌన్ ను పెట్టారు. ఫ్లోరిడాలోని పోర్ట్ రిచీ పట్టణ ప్రాంతం నుంచి మొక్కలుగానీ..మట్టిగానీ, చెత్తగానీ..భవన నిర్మాణ సామగ్రి, పంటలకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు, సామగ్రిని బయటికి తీసుకెళ్లకుండా నిషేధం విధించారు.పొలాలు, తోటల్లో వినియోగించే వాహనాలను కూడా పూర్తిగా సర్వీసింగ్ చేసిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పోర్ట్ రిచీ పట్టణంలోని అన్ని ప్రాంతాలు, పొలాలు, తోటలు, ఉద్యానవనాల్లో నత్తలను చంపేసే రసాయనాలను చల్లుతున్నారు.