వచ్చేయ్ బాబాయ్ : విజయ్ మాల్యా పిటిషన్ కొట్టేసిన యూకే హైకోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 11:29 AM IST
వచ్చేయ్ బాబాయ్ : విజయ్ మాల్యా పిటిషన్ కొట్టేసిన యూకే హైకోర్టు

లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం భారత బ్యాంకుల నుంచి 9వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని,వాటిని తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా లండన్ పారిపోయిన ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుడు మాల్యాను భారత ప్రభుత్వ విజ్ణప్తి మేరకు భారత్ కు తిరిగి అప్పగించేందుకు 2018 డిసెంబర్ లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసుకున్న పిటిషన్ ను  లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ సోమవారం కొట్టివేసింది.

ఇద్దరు సభ్యుల ధర్మాసనం లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిజబెత్ లాంగ్ తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం మాల్యా అభ్యర్థనను తిరస్కరించింది. భారతీయ బ్యాంకులకు సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా ఎగవేసిన, మాల్యా 2016 మార్చిలో లండన్  పారిపోసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ వంటి పలు ఆరోపణల కింద ఈడీ, సీబీఐ లు మాల్యాపై చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. మాల్యాకు చెందిన ఆస్తులను ఇప్పటికే  ఎటాచ్ చేశాయి.

మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం…విచారణనిమిత్తం అతణ్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ వాదనను సమర్థించిన బ్రిటన్ పోలీసుల సహకారంతో 2017 ఏప్రిల్‌లో మాల్యాను లండన్‌లో భారత అధికారులు అరెస్టు చేశారు. తర్వాత మాల్యాకు బెయిల్ మంజూరైంది. ఈ  నేపథ్యంలోనే 2018 డిసెంబర్‌లోనే విజయ్ మాల్యాను అప్పగించాలని యూకే కోర్టు ఆదేశించింది. 

కాగా, తాను వంద శాతం అప్పులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని ఇప్పటికే మాల్యా పలుమార్లు ప్రకటించాడు. ఎటాచ్ చేసిన తన ఆస్తులను అమ్ముకునే వీలు కల్పించడం ద్వారా బ్యాంకుల అప్పులను తీర్చేస్తానని ప్రకటించాడు.  కరోనా సంక్షోభంలో నైనా తన  కోరిక మన్నించాలని మార్చి, 31న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను మాల్యా అభ్యర్థించిన విషయం తెలిసిందే.