TS ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్ష సమాధాన పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, సమాధాన పత్రాల స్కానింగ్ కాపీలు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తు గడువును జూన్ నెల 30 వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా పేర్కొన్న ప్రకారం దీని గడువు జూన్24, బుధవారంతో ముగిసింది. కాగా, ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా గత రెండు మూడు రోజులుగా అనేకమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
కాగా, మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇద్దరు అధికారులు కరోనా బారినపడటంతో అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. అత్యవసరం అయితేనే విధులకు హాజరు కావాలని కార్యాలయ ఉద్యోగులను కోరినట్లు తెలిసింది. మరోవైపు విద్యార్థుల రీకౌంటింగ్ ప్రక్రియలో జాప్యం జరగకుండా బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అలాగే వివిధ సమస్యలపై వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, సందర్శకుల కోసం కార్యాలయం గేటు బయట గ్రీవెన్స్ బాక్సు ఏర్పాటు చేశారు.విద్యార్ధులు నిర్దేశిత ఫీజు ఆన్ లైన్ లో చెల్లించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. రీకౌంటింగ్ ఒక పేపర్కు అయితే రూ.100 చొప్పున.. ఆన్సర్ బుక్లెట్ స్కాన్డ్ కాపీతో పాటు రీవెరిఫికేషన్కు అయితే ఒక పేపర్కు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ అయిన https://tsbie.cgg.gov.in లో స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే సబ్జెక్ట్ను పొందుపరచాలి. పూర్తి అడ్రస్, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తెలపాలి.మీ దరఖాస్తును ప్రిన్సిపాల్ ద్వారా లేదా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా లేదా వ్యక్తిగతంగా లేదా డీడీ తీసి పోస్టు ద్వారా పంపొచ్చు.
Read: హరితహారం పండుగ : నర్సాపూర్ కు సీఎం కేసీఆర్