Crazy Combinations: మళ్లీ మళ్లీ మేమే.. కాంబినేషన్స్ తో బ్యాక్ టు బ్యాక్ రచ్చ!

హీరోకి డైరెక్టర్.. డైరెక్టర్ కి హీరో.. ఇద్దరికిద్దరు నచ్చితే వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు.

Crazy Combinations: మళ్లీ మళ్లీ మేమే.. కాంబినేషన్స్ తో బ్యాక్ టు బ్యాక్ రచ్చ!

Crazy Combinations

Crazy Combinations: హీరోకి డైరెక్టర్.. డైరెక్టర్ కి హీరో.. ఇద్దరికిద్దరు నచ్చితే వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు. వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ బట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. మాములుగా రిపీట్ కాంబోలు వస్తుంటాయి కానీ ఈమధ్య ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ కాంబినేషన్స్ పెరిగాయి. కొంతమందైతే ఓ సినిమా రిలీజ్ కూడా కాకముందే వెంటనే మరో సినిమా చేస్తామంటున్నారు.

ప్రభాస్ – నాగ్ అశ్విన్… ప్రాజెక్ట్ కె పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా మేజర్ పార్ట్ కూడా షూటింగ్ కాకముందే ఈ డైరెక్టర్ హీరో కాంబోతో మరో సినిమా అనే టాక్ నడుస్తోంది. మిషన్ ఇంపాసిబుల్, ఎవెంజర్స్ వంటి హాలీవుడ్ సినిమాలకు వాడిన అలెక్సా కెమెరాతో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీని చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. 500 కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె లో గ్లోబల్ స్టార్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇలా ప్రాజెక్ట్ కె కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ప్రభాస్ – నాగ్ అశ్విన్ ను కలిపి బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

అఖండ తర్వాత అఖండ2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే అది ఇప్పట్లో కుదరకపోవచ్చు. కానీ చూస్తుంటే బాలయ్య – బోయపాటి కాంబో మరో స్క్రిప్ట్ తో ఈ ఇయర్ పట్టాలెక్కేలా కనిపిస్తుంది. బోయపాటికి బన్నీ డేట్స్ దొరకడం ఇప్పట్లో కష్టమే. రామ్ తో సినిమా అనుకున్నా వర్కవుట్ అయ్యేలా లేదు. సో మళ్లీ బాలయ్యతోనే మరో ప్రాజెక్ట్ ను ఎన్నికలు దగ్గర పడే లోగా చేసే ఆలోచనలో బోయపాటి వున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికి బాలయ్య రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలనుకుంటున్నారు. సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లా మళ్లీ లైన్ వుంటే చాలు ఫైట్లు, డైలాగులతో మళ్లీ భీభత్సం చేసేస్తారు.

అజ్ఞాతవాసి తర్వాత డైరెక్టర్ గా కాదు కానీ భీమ్లా నాయక్ కోసం దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు త్రివిక్రమ్. భీమ్లా నాయక్ స్క్రీన్ ప్లేతో పాటూ డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ రాసినవే. అంతేనా సూపర్ హిట్ లాలా భీమ్లా పాట రాసింది కూడా మాటల మాంత్రికుడే. ఇక మహేశ్ తో చేయబోతున్న మూవీ తర్వాత పవర్ స్టార్ కాంబినేషన్ లో మరో సినిమా చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్. ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సినిమాలే కాకుండా ఎన్నికల లోపు మరో రెండు ప్రాజెక్టులను చేయలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. అందులో ఒకటి త్రివిక్రమ్ తోనే ఉండబోతుందనేది నయా ఖబర్.

లైగర్ కాంబో రిపీట్ పై చర్చ హాట్ గానే జరుగుతోంది. పూరీ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ పై వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటూ జరుగుతున్న లైగర్ జర్నీలో ఇద్దరి మధ్య గట్టి బాండిగ్ ఏర్పడింది. పూరి టేకింగ్‌ పై విజయ్‌ కి అవగాహన పెరిగిందని.. విజయ్‌ మాస్ హీరోయిజాన్ని పూరీ మరింత ఎలివేట్ చేయాలనుకుంటున్నారని చెప్తున్నారు. అందుకే ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. లైగర్ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ వంటి డైరెక్టర్స్ తో వర్క్ చేయాల్సి ఉంది రౌడీబాయ్. మరి వాళ్లతో ఎవరితోనైనా పట్టాలెక్కుతాడో… పూరీనే కావాలంటాడో చూడాలి.

నేషనల్ వైడ్ రికార్డ్స్ కొల్లగొట్టి ప్రైమ్ ఎంట్రీ ఇచ్చేసిన పుష్ప బ్యాచ్ మళ్లీ త్వరలోనే తిరిగి సెట్స్ పైకెళ్లబోతుంది. నిజానికి పుష్ప అనుకున్నప్పుడు ఒక పార్ట్ గానే ప్లాన్ చేశారు. బట్ స్టోరీలో ఉన్న సరుకు, బన్నీ – సుకుమార్ ర్యాపో.. రెండో పార్ట్ తెరకెక్కడానికి కారణమైంది. ఇద్దరి మధ్య ఉన్న బాండిగ్ ఎలాంటిదో పుష్ప థ్యాంక్స్ మీట్ లో అందరూ చూశారు. ఆర్య నుంచి మొదలైన కాంబో ఇప్పుడు నాలుగో సినిమా వరకు వెళ్లింది.

కేజీఎఫ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని, హీరో యశ్ ని పాన్ ఇండియా స్టార్స్ చేసిన సినిమా. నిజానికి ప్రశాంత్ నీల్, యశ్ కేజీఎఫ్ స్టోరీ డెవలప్ మెంట్ టైమ్ లోనే ఈ సినిమా రెండు పార్ట్స్ గా చెస్తే బాగుంటుదనుకున్నారు. ఇద్దరి ర్యాపోతో అలాగే చేయాల్సి వచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 1 అంత హ్యూజ్ సక్సెస్ కొట్టి కేజీఎఫ్ చాప్టర్ 2 అంచనాలు పెంచేసిందంటే హీరో – డైరెక్టర్ కాంబో వర్కవుట్ వల్లే.

వలిమై సినిమా ఇంకా రిలీజ్ కానే లేదు.. మరో సినిమాకు డైరెక్టర్ హెచ్ వినోద్ తో వర్క్ చేయబోతున్నారు అజిత్. అదీ వెంటనే. ఈ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మించబోతున్నాడు. వినోద్ టేకింగ్ బాగా నచ్చడంతో మరొకరికి కమిట్మెంట్ ఇవ్వకుండా.. సేమ్ కాంబోకే ఓటేసారు అజిత్. త్వరలోనే కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది.

అత్రాంగి రే తర్వాత మళ్లీ కలిసి వర్క్ చేస్తున్నారు అక్షయ్ కుమార్ – ధనుశ్ – ఆనంద్ ఎల్ రాయ్. అయితే ఈసారి విడివిడిగా. అవును అక్షయ్ – ఆనంద్ కాంబోలో రక్షాబంధన్ తెరకెక్కుతోంది. అలాగే అక్షయ్ హీరోగా గోర్కా సినిమాను నిర్మిస్తున్నాడు ఆనంద్. అటు ధనుశ్ హీరోగా కూడా డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ సెట్స్ పైకెళ్లబోతుంది. యంగ్ డైరెక్టర్, హీరో కాంబినేషన్స్ కూడా వెంటవెంటనే సెట్ అయిపోతున్నాయి. జాంబిరెడ్డితో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా వెంటనే హనుమ్యాన్ స్టార్ట్ చేసారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హై స్పీడ్ లో జరుగుతుంది.