Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై హైకమాండ్ కీలక నిర్ణయం
Bandi Sanjay : బండి సంజయ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జోరుగా నడిచింది.
Bandi Sanjay – Telangana BJP : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై ఆ పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. బండి సంజయ్ ను మార్చేది లేదని జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. త్వరలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మార్పు అంశం ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బండి సంజయ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జోరుగా నడిచింది. బండి సంజయ్ ప్లేస్ లో ఈటల రాజేందర్ ను బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారమూ జరిగింది. దీనిపై బీజేపీ శ్రేణుల్లో తీవ్రమైన చర్చ నడిచింది. అయితే, అలాంటిదేమీ లేదని, బండి సంజయ్ ఆ పదవిలో కొనసాగుతారని బీజేపీ ముఖ్య నాయకులు చెబుతూ వచ్చారు.
తాజాగా ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించింది. బండి సంజయ్ మార్పు పై క్లారిటీ ఇచ్చింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చేది లేదని, ఆ పదవిలో బండి సంజయ్ కొనసాగుతారని ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది.
బండి సంజయ్ ను మార్చేది లేదన్న తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్.. పార్టీలో ఉన్న సీనియర్లకు ఎన్నికల సమయంలో తగిన బాధ్యతలు అప్పగిస్తామన్నారు. దీంతో ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నేతలంతా సమిష్టిగా పని చేయాలని ఆయన సూచించారు.
ఇక.. పార్టీలో సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి(మహబూబ్ నగర్), డీకే అరుణ(మహబూబ్ నగర్), ఈటల రాజేందర్ (కరీంనగర్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (నల్గొండ), మురళీధర్ రావు(రంగారెడ్డి), రాంచందర్ రావ్ (రంగారెడ్డి), కిషన్ రెడ్డి(హైదరాబాద్), లక్ష్మణ్(హైదరాబాద్), రామచంద్రారెడ్డి(హైదరాబాద్), ఆదిలాబాద్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావ్.. ఇలా సీనియర్లందరికీ జిల్లాల వారిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.