Karnataka Polls: కాంగ్రెస్ పార్టీకీ దొరికిన సినీ హీరో.. ఎన్నికల ప్రచారం చేయనున్న కన్నడ స్టార్ శివ రాజ్కుమార్
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో ఆయన భార్య గీతా రాజ్కుమార్ పార్టీలో చేరారు. దీంతో ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.
Karnataka Polls: భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే ఇద్దరు కన్నడ హీరోలు ప్రచారం చేస్తున్నారు. హీరో కిచ్చా సుదీప్, మరొక హీరో దర్శన్ ఎన్నికల రంగంలో కమలాన్ని గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో సినిమావాళ్ల ప్రభావం అంతగా ఏమీ ఉండదని కాంగ్రెస్ పార్టీ నేతలు బయటికి బుకాయించినప్పటికీ, ఈ పరిణామంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. తమకు కూడా ఒక యాక్టర్ దొరికితే బాగుండు అనుకున్న కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఏదైతేనేమి, కాంగ్రెస్ అసంతృప్తిని తీర్చేందుకు ఒక హీరో దొరికాడు.
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో ఆయన భార్య గీతా రాజ్కుమార్ పార్టీలో చేరారు. దీంతో ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. గీతా రాజ్కుమార్ మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె. ఆమె సోదరుడు మధు బంగారప్ప శివమొగ్గ జిల్లా సొరబ నుంచి బీజేపీకి చెందిన కుమార్ బంగారప్పపై కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు.
ప్రముఖ నటుడు డాక్టర్ రాజ్కుమార్ కుమారుడు శివ రాజ్కుమార్. భార్య గీతతో కలిసి రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శివమొగ్గలో మధు బంగారప్ప తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో శివ రాజ్కుమార్ కూడా చేరడంతో రాజ్కుమార్, పునీత్ రాజ్కుమార్ల అభిమానులలో కాంగ్రెస్ మద్దతును సృష్టించగలదని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ను కాంట్రాక్టర్ల నుంచి తీసుకుందంటూ విమర్శలు గుప్పిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మొత్తం 224 మంది సీట్లలో కనీసం 150 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 119, కాంగ్రెస్కు 75, జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.