Delhi: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సోదాలు చేశారు. నగదు అక్రమ చలామణీ కేసులో మే 30న సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Delhi: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసం, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలో మొత్తం ఆరు ప్రాంతాల్లో, హరియాణాలోని గురుగ్రాంలోని ఓ ప్రాంతంలో ఈడీ దాడులు జరుగుతున్నాయి. నగదు అక్రమ చలామణీ కేసులో మే 30న సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్ 9 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈడీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో సత్యేందర్ జైన్తో పాటు ఆయన భార్య పూనమ్ జైన్, ఇతరులు కూడా ఉన్నారు. సత్యేందర్ జైన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆయనపై ఈడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది.
సత్యేందర్ జైన్ వాటాదారుగా ఉన్న నాలుగు సంస్థలకు వచ్చిన నిధులపై ఆయన వివరణ ఇవ్వలేకపోవడంతో దీనిపై విచారణ కొనసాగుతోంది. అలాగే, ఢిల్లీలో ఆయనకు కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సత్యేందర్ జైన్ తన వాటాలను తన భార్య పేరు మీద బదిలీ చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణలో భాగంగా సత్యేందర్ జైన్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ దాడులు చేస్తోంది.