మెట్రో జర్నీకి బ్రేకులు.. జులైలోనైనా పట్టాలెక్కేనా?

  • Published By: srihari ,Published On : June 20, 2020 / 09:52 AM IST
మెట్రో జర్నీకి బ్రేకులు.. జులైలోనైనా పట్టాలెక్కేనా?

హైదరాబాద్ మెట్రో రైల్వే నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో కరోనా వ్యాప్తితో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. గత మూడు నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో మెట్రో జర్నీకి బ్రేకులు పడుతున్నాయి. కరోనా వ్యాప్తితో మార్చి 22 నుంచి మెట్రో రైళ్లు నిలిచిపోయి డిపోలకే పరిమితమయ్యాయి. మళ్లీ మెట్రో రైళ్లను నడిపే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం మెట్రో అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ జూన్ నెలలో దాదాపు మెట్రో పరుగులు తీస్తాయన్న సంకేతాలు వచ్చాయి. కానీ, ఈ నెలలో కూడా మెట్రో పట్టాలేక్కే పరిస్థితులు కనిపించడం లేదు. 

కరోనా లాక్ డౌన్ కు ముందు మెట్రో రైళ్లలో ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణం చేసేవారు. కరోనా నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల మధ్య భౌతికదూరం తప్పనిసరి అయింది. దీంతో ప్రయాణికులు తరచూ తాకే, నిల్చునే ప్రాంతాలను శానిటైజ్‌ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ కోవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో జాగ్రత్తలు తీసుకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. ఫలితంగా మెట్రో రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి లేదు.  

ప్రస్తుతం ఎల్భీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం.. వెరసీ.. 69 కి.మీ మార్గంలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ L&T వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం సేకరించింది. దీనికి సొంత నిధులు కలిపి మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టింది. లాక్‌డౌన్‌కు ముందు నెలకు రూ.50 కోట్ల ఆదాయంతో దూసుకెళ్లింది.

అంతలోనే కోవిడ్‌ పంజా విసిరింది. మెట్రో నష్టాల్లోకి కూరుకుపోయేలా కనిపిస్తోంది. గత మూడు నెలలుగా ప్రయాణికుల చార్జీలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోయింది. మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు భారమవుతోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడిపే అవకాశాలుంటాయని మెట్రో అధికారులు భావిస్తున్నారు. 

Read: 100 ఏండ్ల జీవితానికి సరిపడా ధైర్యం ఇచ్చాడు – కల్నల్ సంతోష్ సతీమణి సంతోషి