Womens Asia Cup 2023 : విజృంభించిన శ్రేయాంక పాటిల్.. 34 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్థి .. భారత్ ఘన విజయం
ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ టోర్నీలో టీమ్ఇండియా దుమ్ము లేపింది. మంగళవారం భారత మహిళల A జట్టు హాంగ్కాంగ్ మహిళల జట్టును మట్టికరిపించింది.
Womens Asia Cup: ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ (Emerging Women’s Asia Cup 2023) టోర్నీలో టీమ్ఇండియా (Team India)దుమ్ము లేపింది. మంగళవారం భారత మహిళల A జట్టు హాంగ్కాంగ్( Hong Kong) మహిళల జట్టును మట్టికరిపించింది. భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ జట్టు 14 ఓవర్లలో 34 పరుగులకే ఆలౌటైంది. శ్రేయాంక పాటిల్ సంచలన ప్రదర్శన చేసింది. 3 ఓవర్లు వేసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసింది. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్లు చెరో రెండు, టిటాస్ సాధు ఓ వికెట్ తీసింది.
హాంగ్కాంగ్ బ్యాటర్లలో మరికో హిల్ 14 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇందులో నలుగు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో గొంగిడి త్రిష 19 నాటౌట్, ఉమా చెత్రీ 16 నాటౌట్ పరుగులతో రాణించగా కెప్టెన్ శ్వేతా సెహ్రావత్(2) విఫలమైంది. మొదటి మ్యాచ్లోనే ఘన విజయాన్ని అందుకున్న భారత్ టేబుల్ టాపర్గా నిలిచింది.
హాంకాంగ్ వేదికగా ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జరుగుతోంది. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్ ఉంది. టీమ్ఇండియాతో పాటు హంకాంగ్, థాయ్లాండ్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, యూఏఈ జట్లు ఉన్నాయి. టీమ్ఇండియా తన తదుపరి మ్యాచ్లను థాయ్లాండ్తో జూన్ 15, చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో జూన్ 17న ఆడనుంది.