IPL2023 Playoffs: వర్షం వల్ల ప్లేఆఫ్స్ మ్యాచ్లు రద్దైతే పరిస్థితి ఏంటి..? విజేతను ఎలా నిర్ణయిస్తారు.?
లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ను కేటాయించారు. మరీ ప్లే ఆఫ్స్ మ్యాచులు వర్షం కారణంగా రద్దైతే పరిస్థితి ఏంటి..?
IPL2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. లీగ్ దశ ముగియగా అత్యుత్తమంగా ఆడిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. నేటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. ఇంకో నాలుగు మ్యాచుల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది. లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ను కేటాయించారు. మరీ ప్లే ఆఫ్స్(Playoffs) మ్యాచులు వర్షం కారణంగా రద్దైతే పరిస్థితి ఏంటి..? అన్న సందేహం చాలా మందిలో మెదులుతుంది.
ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు రిజర్వే డే లేదు. దీంతో వర్షం కురిస్తే ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. వర్షం అంతరాయం కలిగిస్తే.. మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు ఉంటే ఓవర్లు తగ్గించైనా నిర్వహించవచ్చు. కనీసం 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ను నిర్వహించేందుకు సాధ్యమైనంత వరకు అంపైర్లు ప్రయత్నిస్తారు. అది సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ను ఆశ్రయిస్తారు. ఇందుకు కటాఫ్ టైమ్ అర్థరాత్రి 12.50గా నిర్ణయించారు.
IPL2023: ఫైనల్కు చేరేది ఎవరు..? ధోని సేనకు కష్టమేనా..? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా..
ఈ సమయం వరకు కూడా సూపర్ ఓవర్ను నిర్వహించలేని పరిస్థితులు ఉంటే ఇరు జట్లలో లీగ్ స్టేజ్లో టాప్లో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఊదాహారణకు నేడు చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రద్దు అయితే.. గుజరాత్ నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఎందుకంటే లీగ్ దశలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి.
అప్పుడు చెన్నై క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది. ఇదే నియమం క్వాలిఫయర్ 2కి వర్తిస్తుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే రిజర్వే డేలో నిర్వహించే అవకాశం ఉంది. అలా సాధ్యం కాని పక్షంలో రెండు జట్లలో టేబుల్ టాపర్గా ఎవరైతే ఉంటారో వారికి టైటిల్ను అందించనున్నారు.
ఇక్కడ అభిమానులకు శుభవార్త ఏమిటంటే క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్లు చెన్నైలోని చెపాక్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్లకు వర్షం ఆటంకాలు అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
IPL Playoffs: 10లో 4 మిగిలాయ్.. ప్లే ఆఫ్స్ ఇలా.. ఐపీఎల్ విజేత ఎవరో..?