Maharashtra Politics: శరద్ పవార్కు మరో ఎదురుదెబ్బ.. అజిత్ పవార్ బాటలో జయంత్ పాటిల్.. బీజేపీలోకి వెళ్లడం ఖాయమట!
సీఆర్సీఎస్ కార్యాలయం డిజిటల్ పోర్టల్ ప్రారంభం కోసం వచ్చిన అమిత్ షాను శరద్ పవార్ వర్గం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఈరోజు పూణెలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి
NCP vs NCP: మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. తాజా పరిణామాల ప్రకారం శరద్పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ బీజేపీలో చేరుతారనే చర్చ సాగుతోంది. మరోవైపు పూణెలో అజిత్ పవార్తో వేదిక పంచుకున్న అమిత్ షా మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అజిత్ పవార్ తొలిసారి వచ్చారని, చాలా కాలం తర్వాత ఆయన సరైన స్థానంలో కూర్చున్నారని అన్నారు. ‘‘ఇది సరైన స్థలం, కానీ మీరు చాలా ఆలస్యంగా వచ్చారు’’ అని అమిత్ షా అన్నారు.
సీఆర్సీఎస్ కార్యాలయం డిజిటల్ పోర్టల్ ప్రారంభం కోసం వచ్చిన అమిత్ షాను శరద్ పవార్ వర్గం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఈరోజు పూణెలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో పొలిటికల్ కారిడార్లో వాడీవేడి చర్చ ప్రారంభమైంది. త్వరలో జయంత్ పాటిల్ కూడా అజిత్ పవార్ గ్రూపులో చేరి అధికారంలో పాలుపంచుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
అమిత్ షాను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కలిశారు. ఈ ఉదయం అమిత్ షాతో జయంత్ పాటిల్ ఫోన్లో మాట్లాడినట్లు అజిత్ పవార్ చెప్పినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత షా ఆయనను కలవాలని పిలిచినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో మహారాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఆగస్టు 15 తర్వాత ఈ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు.
అయితే, ఈ పుకార్లను మహారాష్ట్ర ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం)కి చెందిన జయంత్ పాటిల్ కొట్టిపారేశారు. తాను అమిత్ షాను కలవలేదని స్పష్టం చేశారు. అలాంటి పుకార్లను నమ్మొద్దని చెప్పారు. ‘‘అమిత్ షాను కలిశానని మీకు ఎవరు చెప్పారు? ఇదంతా చెబుతున్న వాళ్లనే అడగాలి. నిన్న సాయంత్రం నేను శరద్ పవార్ నివాసంలో ఉన్నాను. నేను ఎవరినీ కలవలేదు’’ అని అన్నారు.