Rahul Gandhi : ఓయూలో రాహుల్ సభకు నో పర్మిషన్
ఈనెల 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. కానీ.. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
Osmania University : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభకే కాదు.. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. అంతేకాదు క్యాంపస్లోకి కెమెరాలను కూడా నిషేధించింది. ఈనెల 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. కానీ.. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఓయూలో ఆందోళనకు దిగాయి.
రాహుల్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ఫైర్ అయ్యింది. ఓయూలో నిరసనల తెలిపింది. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థిసంఘాల నేతలు ప్రయత్నించారు. దీంతో ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
congress: రాహుల్ గాంధీ పర్యటన.. సమావేశమైన టీపీసీసీ
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్తో నిర్వహించిన సమావేశంలో నేతలు కీలక విషయాలపై చర్చించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాత్రి డిన్నర్ మీట్లో ఠాగూర్తో టీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాహుల్ సభ ఏర్పాట్లు, కాంగ్రెస్లో తాజా పరిణామాలపై చర్చించారు. ఈ భేటీకి ఏఐసీసీ సెక్రటరీ బోసురాజు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజా నర్సింహాతో పాటు వ్యూహకర్త సునీల్ కొనుగోలు హాజరయ్యారు. వీరితో పాటు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, మధు యాష్కి శ్రీధర్బాబు ఉన్నారు.
మరోవైపు మాణిక్కం ఠాగూర్తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. నల్లగొండలో జరిగిన రాహుల్ సభ సన్నాహక సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకాలేదు. దీనిపై ఠాగూర్కు కోమటిరెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రాహుల్ సభపై ఇరువులు చర్చించినట్టు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనాలని కోమటిరెడ్డికి ఠాగూర్ సూచించారు. ఇక పార్టీ సమస్యలను అంతర్గతంగా చర్చించాలే తప్ప.. మీడియా ముందు ప్రస్తావించవద్దని ఠాగూర్ చెప్పినట్టు సమాచారం. దీంతో తాను పార్టీలైన్లోనే పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఠాగూర్కు తెలిపినట్టు తెలుస్తోంది.