Manish Tiwari : సీబీఐ,ఈడీ చీఫ్ ల పదవీకాలం పొడగింపుపై సుప్రీంకి విపక్షాలు!
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల కాంగ్రెస్
Manish Tiwari : కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం చర్యకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది.
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇప్పటికే మోదీ సర్కార్పై ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అగ్రనేతలు, మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలతో మోదీ సర్కార్ దాడులు చేయిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సోమవారం కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ..”1998 జైన్ హవాలా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్లు చట్టవిరుద్ధమైనవి. దర్యాప్తు ఏజెన్సీలను ఎలాంటి తప్పిదాలకు కేంద్రం ప్రేరేపించకుండా నిరోధించేందుకు సుప్రీంకోర్టు.. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని రెండేండ్లుగా నిర్ధేశించగా, కేంద్రం సుప్రీం ఉత్తర్వులకు విరుద్ధంగా ఆర్డినెన్సులు జారీ చేసింది. మేం (కేంద్రం) మిమ్నల్ని నియమించామంటే మా ఆదేశాలకు అనుగుణంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుందని ఈ ఆర్డినెన్స్ ఆయా అధికారులకు సంకేతం పంపింది. విపక్షాలను వేధిస్తుంటే మీ పదవీకాలం ఏడికేడు పెంచుతామనేలా కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి”అని తివారీ అన్నారు.
కాగా, రెండేళ్ల సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని తాజాగా ఐదేళ్లకు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను ఆదివారం జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న రెండేళ్ల పదవీకాలం సమయంలో వారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వారిని తొలగించేందుకు ఆస్కారం ఉండేది కాదు. అయితే వీరి పదవీకాలం ముగిసిన తర్వాత పనితీరు బాగుందని అనిపిస్తే.. కేంద్ర ప్రభుత్వం మరికొంత కాలం వారిని పొడిగించేందుకు ఆస్కారం ఉండేది.
అయితే తాజాగా తీసుకొచ్చిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్ 2021 ప్రకారం ఒక ఏడాది పాటు పొడిగించేందుకు వీలుంటుంది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పదవి నియామకంపై తొలుత ఉన్న వ్యవధిని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, క్లాజ్(ఎ) కింద కమిటీ సిఫార్సుపై, రాతపూర్వకంగా కారణం నమోదు మేరకు ఒక్కసారికి ఒక్క ఏడాది వరకు పొడిగించవచ్చు అని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్ 2021లో కేంద్రం పేర్కొంది. అయితే ప్రాథమిక నియామకంలో పేర్కొన్న వ్యవధితో సహా మొత్తం ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత అటువంటి పొడిగింపుకు అవకాశం లేదని ఆ ఆర్డినెన్స్లో కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా జారీ చేసిన ఈరెండు ఆర్డినెన్స్లపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం కూడా చేశారు. .
అయితే 1997 కంటే ముందు సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం నిర్దిష్టంగా పేర్కొన లేదు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏ సమయంలోనైనా వీరిని తొలగించే అధికారం కలిగి ఉండేది. 2018లో బాధ్యతలు స్వీకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ ఎస్కే మిశ్రా పదవీకాలం పొడిగింపుతో ముడిపడి ఉన్న కేసులో జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది, పదవీకాలం పొడిగింపు ‘అరుదైన మరియు అసాధారణమైన సందర్భంలో మాత్రమే చేయాలని’ కోర్టు పేర్కొంది.