Sharad Pawar: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా..! అజిత్ పవార్ నిర్ణయమే కారణమా?
శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. ఎన్సీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. రాజీనామా చేయొద్దంటూ కార్యకర్తలు, పార్టీ నేతలు వేదికపైకి ఎక్కి నినాదాలు చేశారు.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షులు శరద్ పవార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం తన ఆత్మకథ పుస్తకం రెండో భాగం విడుదల కార్యక్రమంలో పవార్ పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని పవార్ పేర్కొన్నారు. తదుపరి అధ్యక్షుడి ఎన్నికకోసం పార్టీ సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవార్ చెప్పారు.
శరద్ పవార్ కు 82ఏళ్లు. ఆయన 24ఏళ్లుగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ విషయంపై శరద్ పవార్ మాట్లాడుతూ.. నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 24ఏళ్లు. 1960 మే 1 నుంచి తన ప్రజాజీవన యాత్ర ప్రారంభమైంది. గత 63ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతోందని అన్నారు. ఈ సమయంలో నేను మహారాష్ట్ర, దేశంలో విభిన్నపాత్రల్లో పనిచేశానని పవార్ చెప్పారు. నా రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు మిగిలి ఉందని, ఈ సమయంలో నేను ఎటువంటి పదవులు తీసుకోకుండా మహారాష్ట్ర, దేశానికి సంబంధించిన సమస్యలపై దృష్టిపెడతానని శరద్ పవార్ అన్నారు.
శరద్ పవార్ ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పవార్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, శరద్ పవార్ మాత్రం రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటన తరువాత పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ మాట్లాడుతూ.. మేము కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిసి కూర్చొని ఈ విషయంపై మాట్లాడతాం. పార్టీకార్యకర్తల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. పార్టీ సమావేశంలో శరద్ పవార్ నిర్ణయం మేరకు మా నిర్ణయం ఉంటుందని అజిత్ పవార్ చెప్పారు.
Karnataka Election 2023 : కర్ణాటకలో బీజేపీ ‘అ..ఆ’ల జపం .. అవేమిటో తెలుసా..?
గత కొంతకాలంగా ఎన్సీపీలో నేతలు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీలోని తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో దోస్తీ కట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని అజిత్ పవార్ ఖడిస్తూ వస్తున్నప్పటికీ.. బాబాయ్, అబ్బాయ్ మధ్య రాజకీయ విబేధాల నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.