Governor Tamilisai : విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం చేసారు. దీంతో సదరు వ్యక్తి కోలుకుని ధన్యవాదాలు తెలిపాడు.
Governor Tamilisai treatment to a passenger in indigo flight : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్ అనే విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చాక తమిళిసై వైద్యవృత్తిని పక్కనపెట్టి గవర్నర్ గా బిజీ అయిపోయారు. ఈక్రమంలో ఆమె అనుకోకుండా డాక్టర్ గా మారారు. తమిళిసై ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి హఠాత్తుగా అస్వస్థతకు గురి కాగా గవర్నర్ తమిళిసై డాక్టర్ గా మారి సదరు వ్యక్తికి వైద్యం చేశారు. తమిళిసై ప్రాథమిక చికిత్సతతో అనారోగ్యం నుంచి తేరుకున్న ఆ ప్రయాణికుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానంలో తమిళిసై ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురి అయ్యాడు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఇక్కడ డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? అని అంటూ అనౌన్స్మెంట్ చేశారు. దీంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తమిళిసై వెంటనే స్పందించారు.. నేరుగా బాధితుడి వద్దకు వెళ్లిప్రాథమిక చికిత్స చేయగా అతను కాసేపటికి కోలుకున్నాడు. బాధితుడు కోలుకున్నాక… విమాన సిబ్బందికి ఆమె కొన్ని సూచనలు చేశారు. విమానం బయలుదేరే ముందే ప్రయాణికుల్లో డాక్టర్లు ఉన్నట్లైతే… ముందుగా చార్ట్లోనే విషయాన్ని తెలియజేయాలని ఆమె సూచించారు. అంతేకాకుండా కనీసం సీపీఆర్ చేసుకునేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని కూడా ఆమె సూచించారు.