కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్‌కు సమాన హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్.. నగరానికి ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కు సమానంగా నూతన హోదాను కల్పించాలని కోరారు. “గత ఆరేండ్లుగా హైదరాబాద్‌ నగరం ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని, దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రగతి ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో ప్రశ్నార్థకమైనా.. తెలంగాణలో మాత్రం భారీగా ఐటీ ఎగుమతులు పెరిగింది” అని లేఖలో వెల్లడించారు.

జాతీయ సగటు 1.9శాతం ఉండగా.. తెలంగాణ గ్రోత్ రేట్ 7 శాతంతో 1.4 లక్షల కోట్లుగా ఉందని, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్ మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటో మొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా లేఖలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెక్నాలజీస్, బ్లాక్చైన్ వంటి నూతన ఎమర్జింగ్ టెక్నాలజీలను సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తోందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా గొప్ప సృజనాత్మక ఎకో సిస్టం నగరంలో ఉన్నదని, ఈ రంగంలో టీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థలు నెలకొల్పామని తెలిపారు. ఐటీ అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరానికి కేంద్రం ప్రత్యేక ప్రోత్సహం అందించాల్సిన అవసరం ఉందని లేఖలో కోరారు.