Pm Modi: యూపీలో వరుస పర్యటనలు.. సమయం లేదు మిత్రమా!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కొన్నిరోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇక మనకు సమయం లేదు మిత్రమా!
Pm Modi: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కొన్నిరోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇక మనకు సమయం లేదు మిత్రమా! అంటూ ప్రధానమంత్రి మోదీ.. సీఎం యోగీ.. యూపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికలు జరగడానికి మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండగా.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో యూపీని చుట్టేస్తున్నారు ప్రధాని మోదీ.
ఈ క్రమంలోనే యూపీలో మరోసారి పర్యటించబోతున్నారు ప్రధానమంత్రి మోదీ. షాజహాన్పుర్లో గంగా ఎక్స్ప్రేస్వేకు శంకుస్థాపన చేయనున్నారు. 594 కిలోమీటర్ల ఈ ఎక్స్ప్రెస్వే కోసం 36వేల 200కోట్లు వెచ్చించనున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాల అత్యవసర ల్యాండింగ్, టేకాఫ్ కోసం మూడున్నర కిలోమీటర్ల పొడవైన ఎయిర్స్ట్రిప్ను ఈ ఎక్స్ప్రెస్వేలో నిర్మించనున్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్తో పాటు అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే, ఈ పర్యటనలు ఇప్పట్లో ముగిసేలా లేవు. మరో మూడు సార్లు యూపీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధాని మోదీ. రానున్న 10రోజుల్లో మొత్తం నాలుగు సార్లు వేర్వేరు చోట్ల వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు మోదీ.
డిసెంబర్ 21న ప్రయాగ్ రాజ్లో 2 లక్షల మంది మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కానున్నారు. డిసెంబర్ 23న వారణాసిలో మరోసారి పర్యటిస్తారు. ఆ తర్వాత ఈ నెల 28న కాన్పూర్లో పర్యటించి మెట్రోను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాదిలో యూపీలో ఎన్నికలు జరుగనున్నాయి.
దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసి, కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలని నిర్దేశించే సత్తా గల అతి పెద్ద రాష్ట్రం యూపీ.. గత ఎన్నికల్లో 403 స్థానాలకు గాను 309 స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ.. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలలో ఉంది కాషాయదళం.. ఇప్పటికే ఈ రాష్ట్రానికి భారీగా నిధులను గుమ్మరిస్తున్న కేంద్రం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించింది.
అదే సమయంలో ప్రధాని మోదీ పర్యటనలు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించాలనుకుంటున్నారు.. ఇందులో భాగంగానే వరుస పర్యటనలు చేస్తున్నారు.