IPL 2023: మహ్మద్ సిరాజ్ ఇంట్లో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ టీం ప్లేయర్లు సందడి.. ఫొటోలు, వీడియో వైరల్
హైదరాబాద్ ఫిల్మ్నగర్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్ 2023లో ఆర్సీబీ జట్టు ప్లేయర్ మహ్మద్ సిరాజ్ నూతన నివాసాన్ని కోహ్లీ, ఆర్సీబీ సభ్యులు సందర్శించారు.
Mohammed Siraj : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్ తో పాటు ఆర్సీబీ జట్టు టీం సభ్యులు టీమిండియా ఫాస్ట్ బౌలర్, ఆర్సీబీ టీం మెంబర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు. హైదరాబాద్ లోని సిరాజ్ నూతన నివాసంకు ఆర్సీబీ టీం వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆదివారం జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం సోమవారం సాయంత్రమే ఆర్సీబీ టీం సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి సమయంలో హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో మహ్మద్ సిరాజ్ కొత్త ఇంటిని కోహ్లీ, డూప్లెసిస్, వేన్ పార్నెల్, కేదార్ జాదవ్ తో పాటు పలువురు ఆర్సీబీ క్రికెటర్లు సందర్శించారు.
కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మకూడా ఉన్నారు. సిరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేవిధంగా సిరాజ్ నూతన నివాసం వద్ద క్రికెటర్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైర్ గా మారింది.
Virat Kohli, Faf Du Plessis and other RCB players visited Mohammad Siraj's new house. pic.twitter.com/saYYluyIGc
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 15, 2023
ఐపీఎల్ 2023 టోర్నీలో ఆర్సీసీ జట్టు ప్లే ఆఫ్ కు కొద్దిదూరంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 12 మ్యాచ్ లు ఆడగా.. ఆరు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆరు మ్యాచ్ లలో ఓడిపోయింది. గురువారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిపోతే ప్లే ఆఫ్ కు ఆ జట్టు వెళ్లడం కష్టతరంగా మారుతుంది.