Virat Kohli Letter BCCI: నేను చేసిన తప్పేంటి.. భారీ జరిమానాపై బీసీసీఐకి లేఖ రాసిన విరాట్ కోహ్లీ
కోహ్లి-గంభీర్, కోహ్లి-నవీనుల్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం విధితమే. సీరియస్ అయిన బీసీసీఐ ముగ్గురికి జరిమానా విధించింది. భారీగా జరిమానా విధించడం పట్ల కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాశాడు.
Virat Kohli Letter BCCI: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అద్భుత బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇదేక్రమంలో ఐపీఎల్లో 7వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా కోహ్లీ (7,043) రికార్డు సృష్టించాడు. కోహ్లీ తన ఆటతీరుతో ఎంత ప్రశంసలు పొందుతున్నాడో.. అదే స్థాయిలో వివాదాలతోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీతో షేక్ హ్యాండ్ వివాదం మొదలుకొని లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ తో వాగ్వాదం వరకు కోహ్లీ విమర్శల పాలయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ – నవీనుల్, కోహ్లీ – గంభీర్ మధ్య వివాదం నెలకొంది. మైదానంలోనే వీరు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. ఇరు జట్ల ప్లేయర్ల జోక్యంతో వాగ్వాదం సర్దుమణిగింది.
లక్నోతో జరిగిన గత మ్యాచ్లోనూ గంబీర్, కోహ్లీకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాజా మ్యాచ్లో కోహ్లీ – నవీనుల్, కోహ్లీ – గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో బీసీసీఐ సీరియస్ అయింది. ముగ్గురికి జరిమానా విధించింది. కోహ్లీకి భారీగా జరిమానా విధించింది. కోహ్లి, గంభీర్కు మ్యాచ్ ఫీజులో 100శాతం, నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులో 50శాతం బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ లో కోహ్లీ జీతం రూ. 15కోట్లు. అంటే ఆర్సీబీ నుంచి ఏడాదిలో రూ. 15 కోట్లు కోహ్లీ అందుకుంటున్నాడు. ఒక మ్యాచ్కు అతనికి రూ. 1.07 కోట్లు వస్తుంది. బీసీసీఐ జరిమానాతో రూ. 1.07 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ జట్టు చెల్లించింది.
బీసీసీఐ తనకు కఠిన శిక్ష విధించడం పై విరాట్ కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలిసింది. నేను ఏం తప్పు చేశానని నాకు భారీగా జరిమానా విధించారంటూ కోహ్లీ ఈలేఖలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరితోనూ ఘర్షణ పడలేదని, నవీనుల్, తర్వాత గంభీర్ తనతో గొడవ పడ్డారని కోహ్లీ బీసీసీఐకి వివరించాడు. చిన్న గొడవకు వందశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడం సరికాదని, నేను అంతపెద్ద తప్పు ఏమీ చేయలేదని కోహ్లీ ఈ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. మరి కోహ్లీ లేఖకు బీసీసీఐ ఎటువంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే.