ఏ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా
ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచికరంగా ఉండడంతో అధికంగా ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు.
ముడి బియ్యం(దంపుడు బియ్యం లేదా పాలిష్ పట్టని బియ్యం). ఈ మధ్య కాలంలో ప్రకృతి వైద్య నిపుణులు ఈ బియ్యం వినియోగంపై ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తెల్ల బియ్యం కంటే ముడి బియ్యమే తినడం బెటర్. తెల్ల బియ్యం నిరంతరం తీసుకుంతే శరీరానికి అందాల్సిన పోషకాలు అందక పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే, ముడి బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. 100 గ్రాముల ముడి బియ్యం తీసుకుంటే 1.8గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అదేవిధంగా తెల్ల బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల కేవలం 0.4గ్రాముల ఫైబర్ మాత్రమే లభిస్తుంది.
ముడి బియ్యంలో అధిక శాతం యాంటి న్యూట్రియెంట్స్, ఫైటిక్ యాసిడ్, ఆర్సెనిక్లు (విష రసాయనం) ఉంటాయి. ఎక్కువ శాతం ముడి బియ్యాన్ని తీసుకోవడంతో యాంటీ న్యూట్రియెంట్స్ వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు ఇబ్బందులు కలిగిస్తాయి.అధికంగా ముడి బియ్యం తీసుకోవడం వల్ల ఆర్సెనిక్ విషరసాయనం ముప్పు ఉంటుంది. మన శరీరంలో అధికంగా ఆర్సెనిక్ చేరడం వల్ల క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ తదితర జబ్బులు వస్తాయి.
మితంగా తినడమే శ్రేయస్కరమని డాక్టర్లు చెబుతున్నారు. మితంగా ముడిబియ్యం తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయి. ముడిబియ్యం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మరోవైపు మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.