20ఏళ్ల తర్వాత కలిసిపోయారు.. అసలు చిరంజీవి, విజయశాంతి మధ్య ఏం జరిగింది?

  • Published By: vamsi ,Published On : January 6, 2020 / 01:19 AM IST
20ఏళ్ల తర్వాత కలిసిపోయారు.. అసలు చిరంజీవి, విజయశాంతి మధ్య ఏం జరిగింది?

చిరంజీవి, విజయశాంతి.. ఒకటి కాదు, రెండు కాదు.. కలిసి పదహారు సినిమాలు చేశారు. టాలీవుడ్ చరిత్రలో వారి కాంబినేషన్ ఎవర్‌గ్రీన్. సంఘర్షణ నుంచి మొదలెట్టి మెకానిక్ అల్లుడు వరకూ మొత్తం పందొమ్మిది సినిమాలు. అందులోనూ హిట్లెక్కువ.. ఫట్లు తక్కువ.. సూపర్ హిట్ కాంబినేషన్స్‌లో ఒకటైన ఈ జంట రియల్ లైఫ్‌లో మాత్రం దాదాపు 20ఏళ్లుగా పలకరించుకోలేదు. యాక్టింగ్ పరంగానే, డాన్సుల్లోనూ పోటీపడి నటించిన వీళ్లిద్దరు రాజకీయాల కారణంగా విడిపోయారు. చెన్నైలో ఎదురెదురు ఇళ్లలో ఉన్న వీళ్లు కుటుంబపరంగా కూడా మంచి అనుబంధం ఉన్నవాళ్లు.

అయితే రాజకీయంగా, వ్యక్తిగతంగా వచ్చిన భేదాభిప్రాయాల వల్ల చిరంజీవి విజయశాంతి ఎక్కడా కలుసుకోలేదు. ఒక దశలో చిరంజీవిపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పడు ఇద్దరూ సినిమాల్లోకి ఉంటున్నారు. అయితే వీళ్లకు కలుసుకునే అవకాశం మాత్రం ఇప్పుడే వచ్చింది.  దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలుసుకున్నారు. వేదిక పంచుకోబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 

అలా 20ఏళ్ల తర్వాత వీరిద్దరు కలుసుకోవడంతో..  ఫంక్షన్‌లో మహేష్-రష్మిక జంట కంటే.. చిరు-విజయశాంతి జోడీనే అందరినీ ఎక్కువగా ఆకర్షించింది. ఈ సంధర్భంగా  చిరంజీవి మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. విజయశాంతి గురించి మాట్లాడుతూ ఎప్పుడో ఇరవై ఎల్లా క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది నా హీరోయిన్ మళ్లీ ఇన్నాళ్ళకు నాకు కనిపించింది. నువ్వు రాజకీయాల్లోకి వెల్లి ఎన్నాళ్ళు అయింది? అని అడిగారు విజయశాంతిని చిరంజీవి. 

అంతేకాదు.. నువ్వు రాజకీయాల్లోకి నా కంటే ముందు వెళ్ళవు కదా.. మరి వెనుక వచ్చిన నన్నెందుకు తిట్టావు? అని సూటిగా అడిగారు. దానికి విజయశాంతి షాక్ అయ్యారు. తరువాత తమాయించుకుని రాజకీయాలు కదా అన్నారు. కానీ చిరంజీవి వదలలేదు. నేను ఎప్పుడన్నా చిన్న మాట నిన్ను అన్నానా? లేదు కదా.. మరి నువ్వెందుకు నన్ను అన్నావు అంటూ మళ్ళీ ప్రశ్నించారు. ఇలా కొద్దిసేపు రాజకీయాల గురించి చిరంజీవి విజయశాంతి మధ్యలో సంభాషణలు నడిచాయి. తర్వాత  ఇద్దరు ఆలింగనం చేసుకుని కలిసిపోయారు.

అయితే మెగాస్టార్ చిరంజీవిని లేడి సూపర్‌స్టార్ విజయశాంతి విషయంలో ఎందుకు అలా ఉన్నారు అని అందరూ అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై అప్పటి తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయశాంతి విమర్శలు చేశారు. రాష్ట్రం విడిపోక ముందు 2008లో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై చిరంజీవి మాట్లాడలేదని, ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారంటూ విమర్శించారు. చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేరని, చిరంజీవికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదంటూ అప్పట్లో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మాటలకు నొచ్చుకున్నారు చిరంజీవి.

అంతేకాదు.. అప్పట్లో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుండడంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అంతకుముందు సినిమాల్లో చేసేప్పుడు కూడా చిరంజీవి ముందు విజయశాంతి అభిమానులు చేసిన నినాదాలు కారణంగా అప్పట్లో వివాదం వచ్చినట్లుగా చెబుతారు. ఏది ఏమైనా రాజ‌కీయాల వ‌ల్ల శ‌త్రువులు పెరిగితే సినిమాల వ‌ల్ల మిత్రులు ద‌గ్గ‌ర‌వుతార‌ని, ఈ వేడుక ద్వారా విజ‌యాశాంతి మ‌ళ్లీ త‌న‌కు ద‌గ్గ‌రైంద‌ని, ఈ క్రెడిట్ మ‌హేష్‌బాబుదే అన్న చిరంజీవి మాటలు వాస్తవం అంటున్నారు అభిమానులు.