మేమేం చెయ్యాలి: కరోనాపై ప్రియాంక చోప్రా సందేహాలు.. డాక్టర్ల సమాధానం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా WHO సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్, టెక్నికల్ లీడ్ ఫర్ కొవిడ్ 19 డాక్టర్ మరియా వన్ కెర్ఖోవ్ను కొన్ని ప్రశ్నలు వేసింది. అవేంటంటే.. కరోనా వైరస్ ఎలా సోకుతుంది? బాధితుడు వైరస్ నుంచి కోలుకున్నాక మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటూ ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ ద్వారా డాక్టర్ ని కొన్ని ప్రశ్నలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.
నిక్ జోనస్ మాట్లాడుతూ.. నేను టైప్ 1 డయాబెటిస్తో, ప్రియాంక అస్తమాతో బాధపడుతున్నాం. మాపై వైరస్ ప్రభావం ఉంటుందేమోనని భయంగా ఉంది. మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగారు? దీనికి డాక్టర్ టెడ్రోస్.. సెల్ఫ్ క్వారంటైన్లో ఉండి మంచి పని చేస్తున్నారు. డయాబెటిస్, హృదయ, శ్వాస సంబంధిత, కేన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వైరస్ ప్రభావానికి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు కూడా ఇంటికే పరిమితం కావాలి అని తెలిపారు.
గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా అని అడిగారు నిక్? గాలి ద్వారా ఇతరులకు సోకదు. తుమ్మినపుడు, దగ్గినపుడు ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే సంక్రమిస్తుంది. అందుకే మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలి. ఆ తర్వాత మోచేతి వరకు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి అని డాక్టర్ తెలిపారు.
వ్యాధి నుంచి కోలుకున్నాక మళ్లీ వస్తుందా అని ప్రియాంకా అడిగింది? ఈ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఇప్పటిదాకా లక్ష మందికిపైగా కోలుకున్నారు. కానీ, వారివల్ల ఎవరికీ ఏ నష్టం జరగలేదని డాక్టర్ తెలిపారు.