‘నిశ్శబ్దం’ సినిమా టెక్నిక్‌తో కోలుకున్న కరోనా పేషెంట్!

  • Published By: sekhar ,Published On : October 8, 2020 / 04:30 PM IST
‘నిశ్శబ్దం’ సినిమా టెక్నిక్‌తో కోలుకున్న కరోనా పేషెంట్!

Coronavirus – Nishabdham Movie Technique: ఒక్కోసారి రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తే.. ఇంకోసారి రీల్ లైఫ్ సంఘటనలే రియల్ లైఫ్‌లోనూ జరుగుతుంటాయి. తాజాగా ‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్క వాడిన టెక్నిక్‌నే వినియోగించి ప్రాణాంతకమైన కరోనా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు.. నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు. అసలేం జరిగింది.. వివరాల్లోకెళ్తే..


హైదరాబాద్‌ మణికొండకు చెందిన రామచంద్రన్‌(45) దివ్యాంగుడు. మాటలురావు.. వినబడదు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో గతనెల 27వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. రోగి సహాయకులకు అనుమతి లేకపోవడంతో రామచంద్రన్‌ ఒక్కడే వార్డులో అడ్మిట్‌ అయ్యాడు. అతడు మాట్లాడలేక పోవడం, చెప్పినా వినిపించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డాడు.

అతడి బదిర భాష వైద్యులకు అర్థం కాలేదు. వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను హావభావాలు, సంజ్ఞల ద్వారా వివరించారు.
మరికొన్ని విషయాలను రోగి సెల్‌ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ చాట్‌ ద్వారా చేరవేశారు. దీంతో వైద్యులు, రోగి మధ్య కమ్యూనికేషన్‌ కొంతమేర మెరుగైంది.


శానిటేషన్, పేషెంట్‌ కేర్‌ టేకర్లు, వార్డ్‌బాయ్స్‌ల వద్దకు వచ్చేసరికి కమ్యూనికేషన్‌ సమస్య మొదలైంది. ఇటీవల విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్క పాటించిన చిట్కాను ఇక్కడ వినియోగించారు.

బాధితుడు తన మొబైల్‌లో ఇంగ్లిష్‌లో టైప్‌ చేస్తే, తెలుగులో బయటకు వినిపించే యాప్స్‌ను వాడడం ద్వారా సమస్య పరిష్కారమైంది. రామచంద్రన్‌ పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్య బృందానికి సిబ్బందికి రామచంద్రన్, సోదరుడు రామానుజన్‌లు కృతజ్ఞతలు తెలిపారు.