నాలుగు దశాబ్దాల కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’

నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’..

  • Published By: sekhar ,Published On : February 1, 2020 / 12:31 PM IST
నాలుగు దశాబ్దాల కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’

నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’..

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్న సినిమా.. చలనచిత్ర పరిశ్రమలో ఒక కళాత్మక దృశ్యకావ్యంగా గుర్తుండిపోయే చిత్రం.. ‘శంకరాభరణం’.. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 2నాటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఓసారి ‘శంకరాభరణం’ చిత్ర విశేషాలను చూద్దాం..
జె.వి.సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ ప్రధాన పాత్రధారులుగా కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో.. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 

కథ విషయానికొస్తే..
శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు) గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు, ఆయనకు ఏకలవ్య శిఫ్యులు చాలామందే ఉంటారు. వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకరశాస్త్రి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ఆమె కూడా ప్రాణాలువిడుస్తుంది.

సంగీతమే ప్రాణం..
ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల నటన… వెరసి ‘శంకరాభరణం’ అనే ఒక అద్భుత కళాఖండం తెలుగు ప్రేక్షకుల చేత నీరాజనాలందుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వర రావు ఈ సినిమాపైనే మూడు రోజులు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. ఈ సినిమా పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కాలం మారుతుంటుంది కాని ఇది మాత్రం కలకాలం నిలిచి ఉండే సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం..
శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో.. ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు. ఇక అవార్డుల విషయానికి వస్తే , జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదంతో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలి సారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది . అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులతోపాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి..